ముడతల చొక్కా.. అరిగిన చెప్పులు , గుర్తున్నాయా : కేసీఆర్, కేటీఆర్లపై బండి సంజయ్ సెటైర్లు
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ నేత , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ముడతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ తాంత్రిక పూజలను నమ్ముకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
![bjp mp bandi sanjay fires on telangana cm kcr and minister ktr during telangana election campaign ksp bjp mp bandi sanjay fires on telangana cm kcr and minister ktr during telangana election campaign ksp](https://static-ai.asianetnews.com/images/01ha28gazjpqekthxennx3x9r5/126c3aab-da8d-4a88-ba56-77ac4728534c-jpg_363x203xt.jpg)
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ నేత , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కేటీఆర్ కండకావరంతో కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, ఒక్కసారి ముడతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. బీఆర్ఎస్లో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాంహౌజ్లు కట్టుకున్నారని పేదలకు మాత్రం గూడు కల్పించరా అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెలో నిరుద్యోగులను బూతులు తిడతావా అంటూ కేటీఆర్పై ఆయన ఫైర్ అయ్యారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం సంగతేమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ తాంత్రిక పూజలను నమ్ముకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు చేశారని.. దానిని ఎలా తీరుస్తారని బండి సంజయ్ నిలదీశారు. అవినీతిలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్ ఏకంగా తలుపులా బార్లా తెరుస్తుందని ఆయన చురకలంటించారు. కాంగ్రెస్లో అందరూ సీఎంలేనని.. 6 గ్యారెంటీలు మడిచి పెట్టుకోవాలని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
ALso Read: Bandi Sanjay: దళిత బంధులో అవినీతి.. కమీషన్ లో కేసీఆర్ కు వాటా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి కొందరు బీఆర్ఎస్ శాసనసభ్యులు కమీషన్లు వసూలు చేస్తున్నారని తనకు తెలుసునంటూ ఇదివరకు కేసీఆర్ వారి పార్టీ నాయకులను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించారు. "రెండుసార్లు బీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ మద్యం తాగి ఫామ్హౌస్లో పడుకున్నారని, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను దారి మళ్లించి పేద కుటుంబాలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు" అని కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్కు మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో బండి సంజయ్ అన్నారు.
అలాగే, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే అంశంపై గురించి కూడా ప్రస్తావించారు. కేంద్రంపై ఊరికే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీటర్లు బిగించాలని నిర్ణయించుకున్నది కేసీఆర్, కానీ బీజేపీ ప్రభుత్వం హెచ్చరించడంతో వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కేటాయిస్తామని ప్రగల్భాలు పలికి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ యువతను ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగ భృతి చెల్లించకుండా మోసం చేశారని బండి సంజయ్ విమర్శించారు.
2బీహెచ్కే ఇళ్లను పంపిణీ చేయకపోవడం, నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ ఉచితంగా చేస్తోందన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యంతో పాటు క్వింటాలు ధాన్యానికి రూ.3,100 కనీస మద్దతు ధర ఇస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.