Telangana Election 2023 : తెలంగాణలో రేపటి నుంచి ప్రియాంకా గాంధీ ప్రచారం.. రెండు రోజులు ఇక్కడే , షెడ్యూల్ ఇదే
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 24న పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెంలలో ప్రియాంక ప్రచారం చేస్తారు. ఆ రోజు రాత్రి ఖమ్మంలో ఆమె బస చేయనున్నారు. మరుసటి రోజు నవంబర్ 25న ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో ప్రియాంక ప్రచారం నిర్వహిస్తారు.
![congress general secretary Priyanka Gandhi To Participate In Telangana Election Campaign for two days ksp congress general secretary Priyanka Gandhi To Participate In Telangana Election Campaign for two days ksp](https://static-ai.asianetnews.com/images/01hdbnk27305gac5mw1v6mqw53/Senior-Congress-leader-Priyanka-Gandhi-1697977567459_363x203xt.jpg)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం చేస్తున్నారు. దీంతో మాటల తూటాలు పేలుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 24న పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెంలలో ప్రియాంక ప్రచారం చేస్తారు. ఆ రోజు రాత్రి ఖమ్మంలో ఆమె బస చేయనున్నారు. మరుసటి రోజు నవంబర్ 25న ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో ప్రియాంక ప్రచారం నిర్వహిస్తారు.
బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నల్గొండలో ప్రచారం నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకుంటే తెలంగాణ ఎలా వుండేదని ప్రశ్నించారు. మోడీ , కేసీఆర్ ఒక్కటేనని వారిద్దరికీ పేదల కష్టాల పట్టవని, రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యమని ఖర్గే పేర్కొన్నారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరా గాంధీయేనని.. అలాంటి ఆమెను కేసీఆర్ తిడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యమని.. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందన్నారు. సోనియా తెలంగాణను ఇచ్చారని, కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఖర్గే చెప్పారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరిపై కేసీఆర్ రూ.1,40,000 అప్పు చేశారని.. హరిత విప్లవం, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ వున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో 2 లక్షల పోస్టులు ఖాళీగానే వున్నప్పటికీ కేసీఆర్ భర్తీ చేయలేదని మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.