CM Revanth Reddy: నడిరాత్రి నా ఇంటిపై లాఠీలు పడి.. నన్ను నిర్బంధించి.. : సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్
రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం, మల్కాజ్గిరీ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఇది భావోద్వేగ లేఖ. తన ఇంటిపై పోలీసుల లాఠీ పడి సందర్భాన్ని చూసి మల్కాజ్గిరి చలించి ప్రశ్నించే గొంతుకను నిలబెట్టుకుందని తెలిపారు. ఆరు నెలలు తిరిగేలోపే తనను పార్లమెంటుకు పంపించిందని వివరించారు.
![cm revanth reddy emotional open letter to malkajgiri after he resigned as Member of Parliament kms cm revanth reddy emotional open letter to malkajgiri after he resigned as Member of Parliament kms](https://static-ai.asianetnews.com/images/01hh5r1b5c02tsbjpsc7tjba64/gaaz-zuwsaa2-cc-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఎమోషనల్ అయ్యారు. ఆయన తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. మల్కాజ్గిరి నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన ఆయన.. తాజాగా సీఎం పదవి చేపట్టడంతో అనివార్యంగా ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొంత ఎమోషనల్ అయ్యారు. మల్కాజ్గిరి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే గొంతుకకు మల్కాజ్గిరి ప్రాణం పోసిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖ లోపేర్కొన్నారు. రాజ్యం ఆదేశాలతో పోలీసులు తన ఇంటిపై పడి, తనను నిర్బంధించిన సందర్భాన్ని చూసి మల్కాజ్గిరి ప్రజలు చలించిపోయారని, ఆరు నెలలు తిరగకముందే తనను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతును నిలబెట్టారని అననారు. అసలు నేడు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు పునాదులు మల్కాజ్గిరీలోనే ఉన్నాయని వివరించారు.
Also Read: KA Paul: తెలంగాణలో 79 సీట్లు గెలిచేవాళ్లం.. ఏపీలో 175 గెలుస్తాం: కేఏ పాల్
తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్కు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మల్కాజ్గిరీకి అంతే ప్రాధన్యత అని, తనను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్గిరీదేనని రేవంత్ రెడ్డి వివరించారు. తాను కేవలం ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేశారని, మల్కాజ్గిరీ ప్రజలు తన గుండెల్లో శాశ్వతం అని పేర్కొన్నారు. మల్కాజ్గిరీకి ఎప్పుడూ రుణపడి ఉంటానని వివరించారు. మల్కాజ్గిరీ ప్రజలు పోసిన ఊపిరి.. తన చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుందని తెలిపారు.
ఓటుకు నోటు కేసులో రాత్రిపూట పోలీసులు రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయనను బలవంతంగా జీపు ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. అప్పుడు వెళ్లుతూ వెళ్లుతూ తాను ఇలాంటి వాటికి భయపడబోనని, కేసీఆర్ను ఎదుర్కొనే మనోధైర్యం తనకు ఉన్నదని చాలెంజ్ చేస్తూ రేవంత్ రెడ్డి వెళ్లిన వీడియో ఇటీవలే మరోసారి వైరల్ అయింది. ఆ సమయంలో కూతురు పెళ్లికి కూడా షరతుల మీద కొన్ని గంటలపాటు జైలు నుంచి బయటికి వచ్చి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ తాజాగా మల్కాజ్గిరి ప్రజల కోసం భావోద్వేగ లేఖ రాశారు.