బీవేర్: ఐటీ శాఖ పేరిట మెయిల్.. కీలక సమాచారం తస్కరణకు హ్యాకర్స్
శతకోటి మోసాలకు అనంత కోటి ఉపాయాలు. అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హ్యాకర్లను అడ్డుకోవడం క్లిష్టంగా మారింది. ఐటీ రిటర్న్స్ పంపించేసిన తర్వాత కూడా ఐటీ శాఖ పేరిట మెయిల్స్ పంపి.. వాటిని డౌన్ లోడ్ చేసుకోగానే సంబంధిత వ్యక్తి ఆదాయం, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలన్నీ తస్కరించి హ్యాకర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ సంగతిని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) గుర్తించింది. సదరు మాల్వేర్ను నిర్వీర్యం చేసింది.
దేశీయంగా ఇంటర్నెట్లో మరోసారి మాల్వేర్ కలకలం రేపుతోంది. ఆదాయం పన్ను శాఖ పేరిట మోసపూరిత ఈ-మెయిల్స్తో పన్ను చెల్లిపుదార్ల విలువైన సమాచారాన్ని సేకరిస్తోంది ఈ వైరస్. ఇలాంటి మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయం పన్ను శాఖ అధికారులు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఇంటర్నెట్ వినియోగదారులను హెచ్చరిస్తున్నాయి.
దేశంలో ఆన్లైన్ నేరగాళ్లు హ్యాకింగ్ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఆదాయ పన్ను శాఖ పేరుతో మెయిల్స్ పంపి హ్యాకింగ్కు పాల్పడుతున్నట్లు ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది.
"ఓ మోసపూరిత మాల్వేర్ ఈ నెల 12 నుంచి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. వ్యక్తులు, ఆర్థిక సంస్థలే లక్ష్యంగా.. ఆదాయం పన్ను శాఖ పేరుతో ఈ మాల్వేర్ నకిలీ మెయిల్స్ పంపిస్తోంది’ అని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) తెలిపింది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ దేశ ఇంటర్నెట్ డొమైన్లో మాల్వేర్లు, హ్యాకింగ్, ఫిషింగ్ వంటి కార్యకలాపాలను గుర్తించే సంస్థ. మాల్వేర్ పంపిస్తున్న రెండు రకాల మోసపూరిత మెయిల్స్ను సీఈఆర్టీ గుర్తించింది.
మొదటి రకం ‘.ఐఎంజీ’, రెండో రకం ‘.పీఐఎఫ్’ అనే ప్రమాదకర ఫైళ్లను జోడిస్తున్నారు. అటుపై ఇన్ కం టాక్స్ ఇండియా {.} ఇన్ ఫో అనే మోసపూరిత డొమైన్ ద్వారా మెయిల్స్ పంపిస్తున్నట్లు సీఈఆర్టీ తెలిపింది.
ఈ ఫైళ్లు డౌన్లోడ్ చెసుకోవడం ద్వారా ఆ మాల్వేర్ విలువైన సమాచారాన్ని చోరీ చేసి హ్యాకర్లకు పంపిస్తున్నట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదకర డొమైన్ను నిర్వీర్యం చేసినట్లు సీఈఆర్టీ వెల్లడించింది.
‘ప్రమాదకర మెయిల్స్, ఫైల్స్ వచ్చినట్లు గుర్తిస్తే వాటిని ఎట్టిపరిస్థితుల్లో తెరవద్దు. ఎంఎస్ ఆఫీస్లో ఆటోమేటిక్గా నడిచే విండోలను డిసేబుల్ చేయాలి. అనుమానిత యూఆర్ఎల్లపై క్లిక్ చేయొద్దు. ఒక వేళ ఏదైనా వాస్తవిక యూఆర్ఎల్తో సందేశాలు వస్తే... మెయిల్ పంపిన సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవాలి’ అని సీఈఆర్టీ చెబుతోంది.
ప్రమాదకర మాల్వేర్ సంచరిస్తున్న నేపథ్యంలో.. ఇంటర్నెట్ యూజర్లు తమ ఫైలింగ్, రీఫండ్ సహా ఆదాయం పన్ను శాఖతో ఉండే ఇతర సంబంధాలపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఐటీ అధికారి ఒకరు సూచించారు. ఆదాయం పన్ను, బ్యాంకింగ్ వివరాల గురించి ఏవైనా అనుమానించదగ్గ మెయిల్స్ వస్తే.. వాటి నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.