Asianet News TeluguAsianet News Telugu

బ్రాండ్‌కే యూత్ ప్రియారిటీ: నార్త్&ఈస్ట్ చేంజింగ్ ఫాస్ట్..

ఇండియన్ల ఆలోచనా ధోరణిలో భారీగా మార్చులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా దూసుకొస్తున్న స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై భారతీయులు.. ప్రత్యేకించి తూర్పు, ఉత్తర భారత రాష్ట్రాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తరుచుగా ఫోన్లు మార్చేస్తున్నారు. ఇక యువత తమకు ఇష్టమైన బ్రాండ్‌లో కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తే కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తంగా 40% మంది ఇండియన్లు ఏడాది లోపే కొత్త ఫోన్లకు మారిపోతున్నారని 91మొబైల్స్‌ డాట్‌ కామ్‌ అధ్యయనం తేల్చింది.

New study says 40% smartphone users upgrade to new devices within a year
Author
Hyderabad, First Published Mar 9, 2019, 2:28 PM IST

కాలాన్ని బట్టి మార్పులు సహజమే. భారతీయులు కొత్త వస్తువులు, ఖరీదుతో కూడుకున్న వస్తువైతే పది కాలాల పాటు భద్రంగా దాచి పెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చే వారు. కానీ టెక్నాలజీ రంగ ప్రవేశంతో వారి వైఖరి, ఆలోచనా ధోరణి కూడా మారుతోందని తెలుస్తోంది.

ఈ టెక్నాలజీ యుగంలో వినియోగదారుల అభిరుచులూ కాలంతోపాటే వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా మొబైల్‌ వాడకం విషయంలో ఈ స్పీడ్‌ కాసింతే ఎక్కువే ఉంది. యువ కస్టమర్లయితే మార్కెట్లోకి వచ్చే కొత్త మోడళ్లపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు.
 
వినియోగదారులు చాలా త్వరత్వరగా స్మార్ట్‌ఫోన్లను మార్చేస్తున్నారు. రమారమీ 40 శాతం మంది తమ ఫోన్లను ఏడాదిలోపే మార్చేస్తున్నారని 91మొబైల్స్‌ డాట్‌ కామ్‌ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. 

ఉత్తర రాష్ట్రాలు, తూర్పు భారత రాష్ట్రాల కస్టమర్లు మిగతా ప్రాంతాల వారికంటే తరచుగా అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. మహిళల కంటే పురుషులు మాటిమాటికి తమ ఫోన్లను మార్చేస్తున్నారని తేలింది. ఏడాదిలోపు మొబైల్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పురుషులు 40 శాతం కాగా మహిళల్లో ఇది వాటా 30% ఉందని 91 మొబైల్స్‌ తెలిపింది.

35 ఏళ్లు దాటిన వారితో పోలిస్తే 35 ఏళ్లలోపు యువత మరింత తరచుగా ఫోన్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే ఆలోచన ఉందని సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది పేర్కొనడం గమనార్హం.
 
వచ్చేసారి రూ.10,000-20,000 మధ్య ధర గల స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు 56% మంది మొగ్గు చూపుతున్నారు. వారిలో 44 శాతం మంది ఆన్‌లైన్‌లో, 40 శాతం ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 16 శాతం ఎటూ తేల్చుకోలేకపోయారు. ఆన్‌లైన్‌తో పోలిస్తే ఆఫ్‌లైన్‌లో రూ.1,000 అధికంగా వెచ్చించాల్సిన పక్షంలో 60 శాతం ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తామన్నారు. 23 శాతం మంది మాత్రం ఆఫ్‌లైన్‌నే ఎంచుకుంటామన్నారు.
 
ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కొనాలా అనే విషయంపై నిర్ణయించుకోకున్నా కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న మోడల్‌పై ఆన్‌లైన్‌లో రీసెర్చ్‌ చేస్తామని 80% మంది తెలిపారు. పనితీరు లేదా స్పీడ్‌, కెమెరా, బ్యాటరీ.. మొబైల్‌ కొనుగోలుకు ముందు కస్టమర్లు ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ కంటే పనితీరుకు రెండింతల ప్రాధాన్యం ఇస్తున్నారు. 
 
35 ఏళ్ల లోపు యువత ఎక్కువగా మొబైల్‌ పనితీరు, కెమెరా సామర్థ్యానికి ప్రాధాన్యం ఇస్తుండగా.. 35 ఏళ్లు దాటిన వారు మాత్రం బ్యాటరీ, డిస్‌ప్లే బాగా ఉండే ఫోన్లు ఎంచుకుంటున్నారు. పురుషులు మొబైల్‌ పనితీరు, డిస్‌ప్లేకు.. మహిళలు కెమెరా, బ్యాటరీ, డిజైన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
 
15వేల మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల నుంచి సేకరించిన జవాబుల ఆధారంగా  వెబ్‌సైట్‌ నివేదికను రూపొందించింది. ఈ ఏడాదిలో కొత్త ఫోన్‌ కొనుగోలు కోసం ఏయే అంశాలను పరిశీలిస్తారు? ఎంత తరచుగా ఫోన్‌ అప్‌గ్రేడ్‌ చేస్తుంటారు?, కొత్త ఫోన్లపై ఎలా రీసెర్చ్‌ చేస్తారు? ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తారా? తదితర ప్రశ్నలకు కస్టమర్ల నుంచి జవాబులు రాబట్టింది.
 
స్మార్ట్‌ఫోన్‌ పనితీరుపై ఓ అంచనాకు రావాలంటే ప్రాసెసర్‌ బ్రాండ్‌ చాలా కీలకమని సర్వేలో పాల్గొన్న 43% మంది తెలిపితే, 27% మంది రామ్‌ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఎక్కువగా ప్రాసెసర్‌ బ్రాండ్‌కు యువత ప్రాధాన్యం ఇస్తుండగా.. పెద్దవారు మాత్రం ర్యామ్‌ సామర్థ్యం అధికంగా గల స్మార్ట్‌ఫోన్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

34% మంది కెమెరా రిజల్యూషన్‌,31% మంది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సెల్ఫీ ఫీచర్‌పై పురుషుల కంటే మహిళలే అధిక ప్రాధాన్యమిస్తారట. సెల్ఫీ దిగేందుకు అత్యంత సమర్థవంతమైన ఫోన్‌నే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతామని 16 శాతం మంది మహిళలు తెలిపారు.
 
చైనా స్మార్ట్ ఫోన్లే భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌ను శాసిస్తున్నాయి. యువత చైనాకు చెందిన షియోమీ, రియల్ మీ బ్రాండ్ ఫోన్లపై మోజు పెంచుకోగా, పెద్దవారు దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్‌తోపాటు చైనా సంస్థలు వన్‌ప్లస్‌, ఆసుస్‌ బ్రాండ్ ఫోన్లపై ఆసక్తి చూపుతున్నారు.

స్త్రీలు కూడా శామ్‌సంగ్‌తోపాటు  చైనా సంస్థలు ఒప్పో, షియోమీ బ్రాండ్ ఫోన్ల కోసం మొగ్గుతున్నారు. మరోవైపు పురుషులు చైనా సంస్థలు వన్‌ప్లస్‌, ఆసుస్ బ్రాండ్లతోపాటు ఫిన్లాండ్‌కు చెందిన నోకియా ఫోన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios