‘ హోదా’ పై ఆందోళన.. వైసీపీ నేతలకు గాయాలు, అరెస్టు
ప్రతిపక్ష, విపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
పలువురు వైఎస్ఆర్సీపీ, వామపక్ష నేతలను గృహ నిర్బంధం చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ.. ప్రతిపక్ష, విపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ.. సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఆందోళనను ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచి వేస్తోంది. ఆందోళన చేపడుతున్న ప్రత్యేక హోదా సాధన సమితి సంఘం, వైసీపీ నేతలను పోలీసులు సోమవారం ఉదయం నుంచి అరెస్టు చేశారు.
నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు, గుడివాడల్లో పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేశారు. కేవలం ధర్నా చౌక్ వద్ద నిరసనకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు అంటున్నారు. అసెంబ్లీ వైపు వెళ్ళే మార్గాల్లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. పలువురు వైఎస్ఆర్సీపీ, వామపక్ష నేతలను గృహ నిర్బంధం చేశారు. చలో అసెంబ్లీ కోసం బయటకు వస్తే అరెస్టు చేస్తామని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలో సెక్షన్ 30 అమలులో ఉందన్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ధర్నాచౌక్ వద్ద వైసీపీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులతో పాటు సీపీఎం, సీపీఐ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేపట్టారు. ధర్నా చేస్తున్ననేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వాహనం నుంచి వైసీపీ నేతలు పార్థసారథి, ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్ లు కిందపడటంతో గాయాలయ్యాయి. అయినా పట్టించుకోని పోలీసులు నేతలను మాచవరం పీఎస్కు తరలించారు.