గేట్స్ కోసం రూ.కోట్ల ఖర్చా?
- బిల్గేట్స్ కోసమే చంద్రబాబు అగ్రిటెక్ సదస్సు ఏర్పాటు చేశారన్న వైసీపీ నేత
- నాలుగు రోజుల్లో రూ.40కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపణ
- రైతులకు ఒరిగిందేమీ లేదన్న వైసీపీ
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ తో ఫోటోలు దిగేందుకు ప్రభుత్వాధినేతలు కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అగ్రిటెక్ సదస్సు పేరుతో రైతులను మరోసారి మభ్యపెట్టారన్నారు. ప్రచారాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని అమర్నాథ్ ఆరోపించారు. బిల్గేట్స్ కోసమే చంద్రబాబు అగ్రిటెక్ సదస్సు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఈవెంట్ల పేరుతో నాలుగు రోజుల్లో రూ.40కోట్లు ఖర్చుపెట్టారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి సీఎంలాగా కాకుండా ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అగ్రిటెక్ సదస్సు వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. అలాంటప్పుడు ఎవరి కోసం ఈ సదస్సులు నిర్వహించారంటూ ప్రశ్నించారు. కనీసం రైతులకు ఉపయోగపడే ఒక్క తీర్మానం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను అసలు పట్టించుకోవడంలేదన్నారు. విశాఖకి ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. ఒటమి భయంతోనే విశాఖలో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించలేదన్నారు.