ఎమ్మెల్యే చింతమనేనికి ఇదేంపని?
- బర్రెలు కాచుకుంటున్న ఎమ్మెల్యే చింతమనేని
- అసెంబ్లీ సమావేశాల నిమత్తం అమరావతి వచ్చిన చింతమనేని
- బర్రెలను కూడా అమరావతికి తెప్పించుకున్న ఎమ్మెల్యే
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూ.. వార్తల్లోకి ఎక్కుతుంటారు. అలాంటి ఆయన ఇప్పుడు గేదెలు కాచుకుంటున్నారు. అదికూడా.. అసెంబ్లీకి కూతవేటు దూరంలో. అసలు విషయం ఏమిటంటే... గత వారం రోజులుగా ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటికి హాజరవ్వడానికి ఆయన అమరావతి వచ్చారు. మొదటి నుంచి చితంతమనేనికి బర్రెలు, గొర్రెలను పర్యవేక్షించడం ఆసక్తి. ఎక్కువ సమయం వాటితోనే గడిపేస్తుంటారు. కాగా... అమరావతి రావడంతో వాటి పర్యవేక్షణ ఎవరు చూసుకుంటారు అని ఆలోచించారు కాబోలు.. ఏకంగా వాటిని అక్కడికి తీసుకొచ్చేశారు.
దీంతో పాటు.. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూములు పంటలు లేకపోవడంతో గడ్డి బాగా పెరిగింది. ఆ గడ్డి తన పశువులు ఉపయోగపడుతుంది అని ఆయన అనుకున్నారు. ఇంకేముంది.. ఆయన గేదెలు, గొర్రెలు అన్నీ.. అమరావతి వద్ద ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు వాటి కోసం ప్రత్యేకంగా టెంట్ కూడా కట్టించారు. ఒకవైపు శాసనసభ సమావేశాలకు హాజరౌతూనే.. మరోవైపు తన పశువులను మేపుకుంటున్నారు. వాటి పర్యవేక్షణ కోసం ఇంటి దగ్గర నుంచి ఇద్దరు పాలేర్లను కూడా తీసుకువచ్చారు. అలా ఆయన పశువులను మేపుతుండగా మీడియా కంటికి చిక్కారు. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది. రాజధాని కట్టేస్తామని రైతుల నుంచి తీసుకున్న భూముల్లో అటు నిర్మాణాలు లేక ఇటు పంటలు లేకపోవడంతో పెరిగిన పిచ్చి గడ్డిని ఎమ్మెల్యే చింతమనేని ఇలా వాడేసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.