కర్నూలు జిల్లాలో సర్వే కలకలం
- ఎమ్మెల్యే సీటు కోసం సర్వే
- కర్నూలు సీటు కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు
- సర్వే ఎవరు చేయించారనే విషయంపై సర్వత్రా ఆసక్తి
కర్నూలు జిల్లాలో సర్వే కలకలం సృష్టిస్తోంది. 2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేకపోవడంతో.. టీడీపీ నేతలు అప్రమత్తమౌతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరిని తమ పార్టీ తరపున నిలబెట్టాలో తెలుసుకునేందుకు సర్వే చేయడం మొదలుపెట్టారు. పార్టీ నుంచి టికెట్ ఎవరికిస్తే బాగుంటుందో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలనే అడుగుతున్నారు. నగరంలోని ఓటర్లకు ఫోన్ చేసి.. టీజీ భరత్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకుంటే... ఒకటి నొక్కాలని, ఎస్వీ మోహన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటే రెండు నొక్కాలని అడుగుతున్నారు. దీంతో.. ఈ సర్వే విధానం ప్రస్తుతం నగరంలో చర్చకు దారి తీసింది.
అసలు విషయం ఏమింటే.. రానున్న ఎన్నికల్లో కర్నూలు సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఒకరు టీజీ భరత్. మరొకరు ఎస్వీ మోహన్ రెడ్డి. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేనని.. కచ్చితంగా తనకే ఇస్తారని ఎస్వీ,.. తాను లోకల్ క్యాండిడేట్ అని.. అందుకే తనకు సీటు ఇస్తారని టీజీ.. చెబుతున్నారు. దీంతో... వీరిద్దరిలో సీటు ఎవరికి దక్కుతుందే అనే విషయం నగరంలో ఆసక్తి కరంగా మారింది.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ సర్వే నిర్వహించారని.. సర్వేలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే.. వారికే సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ సర్వే విషయంలో అధికార పార్టీ నేతల్లోనూ చాలా మందికి సందేహాలున్నాయట. అసలు ఈ సర్వే గురించి చాలా మంది నేతలకు తెలియకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు ఈ సర్వే ఎవరు చేయిస్తున్నారనే అంశం చర్చనీయాంశమైంది.