రెడ్డి బ్రదర్స్ అవినీతికి బిజెపి కాపలా, ఎపికి మోడీ మోసం: తెలుగువాళ్లకు సిద్ధూ లేఖ
కర్ణాటకలోని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన తెలుగు ప్రజల మద్దతు కోరారు
బెంగళూరు: కర్ణాటకలోని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన తెలుగు ప్రజల మద్దతు కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెసు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు.
మంగళవారంనాడు ఆయన తెలుగు సంఘాలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తెలుగు ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ మోసం చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెసు గెలిస్తే ఎపికి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన అన్నారు.
కర్ణాటక అసెంబ్లీని గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియాతో నింపాలని బిజెపి చూస్తోందని ఆయన విమర్శించారు. రెడ్డి బ్రదర్స్ అవినీతికి బిజెపి కాస్తోందని విమర్శించారు. బసవన్న స్ఫూర్తితో తెలుగువాళ్లు తమతో కలిసి రావాలని ఆయన అన్నారు.
ఈసారి ఎన్నికల్లోనూ కాంగ్రెసును బలపరచాలని ఆయన కోరారు. తెలుగువారిది, కన్నడిగులది తరతరాల సోదర బంధమని ఆయన అననారు. దశాబ్దాలుగా తెలుగువారు ఇక్కడ స్థిరపడి ఇక్కడి సంస్కృతిలో భాగమయ్యారని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.