బాలయ్యనెందుకు ప్రశ్నించరు, బాబు టార్గెట్ పవన్: శ్రీరెడ్డి ఇష్యూపై రోజా

తిరుపతి: శ్రీరెడ్డి వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజా స్పందించారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఆమె బాసటగా నిలిచారు. పవన్ కల్యాణ్ తో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ శ్రీరెడ్డి వ్యవహారంలో వ్యక్తిగతంగా తాను పవన్ కల్యాణ్ ను సమర్థిస్తున్నట్లు చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బాలకృష్ణను ప్రశ్నించనివారు పవన్ కల్యాణ్ ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఆమె అడిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారని ఆమె విమర్శించారు. టాలీవుడ్ నుంచి కాస్టింగ్ కౌచ్ ను తరిమేసే పోరాటంలో తాను బాధితులకు అండగా ఉంటానని చెప్పారు.

తాను 1991 నుంచి చిత్రపరిశ్రమలో ఉన్నానని, ఇప్పటి దాకా కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదని ఆమె చెప్పారు. ఇకపై ఎవరికైనా ఇబ్బందులు కలిగితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. ఆదివారం తిరుమలకు వచ్చిన ఆమె మీడియాతో ముచ్చటించారు. 

వ్యక్తిగత ప్రయోజనం కోసం చిత్రపరిశ్రమకు చెందినవారిపై గానీ పవన్ కల్యాణ్ మీద గానీ దూషణలకు దిగడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. విశాఖలో ఉద్యమం చేస్తే సినిమావాళ్లను అరెస్టు చేశారని ఆమె గుర్తు చేశారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడి) పాలక మండలి వివాదాస్పదం కావడం దురదృష్టకరమని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. టీటిడి పాలక మండలి నియామకంపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 

ఇదే టీడీపి ప్రభుత్వం గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చేసిందని ఆమె అన్నారు. ఆలయాల్లో క్షుద్రపూజలు చేస్తున్నారని విమర్శించారు.