సంచలనం సృష్టించిన పీవీ సింధు
- 22-20, 11-21, 21-18 తేడాతో ఘన విజయం
- ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధూ
- గంటకు పైగా హోరాహోరీగా సాగిన పోరు
భారతీయుల కల నెరవేరింది. బ్మాడ్మింటన్ క్రిడాకారిణి పీవీ సింధు.. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో విజయం సాధించింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో సాగిన హోరాహోరీ పోరులో విజయం పీవీ సింధుని వరించింది.
తొలి సెట్ ను 22-20 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో సెట్ ను 11-21 తేడాతో ఓడిపోయి, కీలకమైన మూడో సెట్ లో పుంజుకుంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ, ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధూ, మూడో సెట్ ను 21-18 తేడాతో గెలిచింది.
ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో అద్భుతంగా పోరాడిన సింధుకు తృటిలో స్వర్ణం చేజారిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్లో సింధును ఓడించి ఒకుహర ఛాంపియన్ అయ్యింది. అయితే శనివారం జరిగిన కొరియా ఓపెన్ సెమీఫైనల్లో సింధు గెలుపొందింది. మరో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్-2 యమగూచిని ఓడించి జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహర ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో మరోసారి వీరిద్దరికి టైటిల్ పోరు పడింది. ఆదివారం ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్లో సింధు విజయం సాధించింది.
ఆరంభం నుంచే ఒకుహర దూకుడు ప్రదర్శించగా.. సింధు కూడా దీటుగా బదులిచ్చి 22-20తో తొలి గేమ్ను కైవసం చేసుకుంది. అయితే తొలి గేమ్లో ఆధిక్యం ప్రదర్శించిన సింధు.. రెండో గేమ్లో కాస్త తడబడింది. ఒకుహర విజృంభించడంతో సింధు తేలిపోయింది. దీంతో 11-21తో రెండో గేమ్ను కోల్పోయింది. ఇక డిసైడ్ చేసే మూడో గేమ్లో సింధు మళ్లీ పుంజుకుని 21-18తో టైటిల్ను దక్కించుకుంది. కాగా.. కొరియా ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.
మ్యాచ్ అనంతరం ఒకుహరా, సింధూకు అభినందనలు తెలిపింది. ఈ మ్యాచ్ ఒక గంటా 23 నిమిషాల పాటు సాగింది. సింధు విజయం పట్ల క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.