మరో వివాదంలో అఖిలప్రియ
- మరో వివాదంలో చిక్కుకున్న మంత్రి అఖిలప్రియ
- దీపికా పదుకొణె కి అవార్డు ఇవ్వడంపై విమర్శలు
పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియని వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్న జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి ఆమె ఇంకా బయటపడనేలేదు. ఆలోగానే మరో వివాదానికి ఆమె కేంద్ర బింధువులయ్యారు.అదే..‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో.. అత్యంత ప్రజాధరణ కలిగిన నటిగా గుర్తిస్తూ బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు అందజేశారు. ఆ విషయమే ఇప్పుడు వివాదానికి దారితీసింది.
అసలు విషయం ఏమిటంటే..ఆదివారం అమరావతిలో నిర్వహించిన సోషల్ మీడియా సమ్మిట్ 2017 కార్యక్రమంలో.. దీపికా పదుకొణె, రానా, సంగీత దర్శకుడు అనిరుధ్, హాస్యనటుడు వైవా హర్షలకు అవార్డులు అందజేశారు. అయితే.. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినది కాబట్టి.. టాలీవుడ్ నటులకు ఇవ్వాలి.. అంతేకానీ బాలీవుడ్ నటికి ఎలా అవార్డు ఇస్తారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇదే విషయంపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. దీపిక తప్ప.. టాలీవుడ్ లో ఏ నటులు మీకు కనిపించలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక.. దీపిక నటించిన పద్మావతి సినిమా.. ప్రస్తుతం వివాదంలో నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటి నేపథ్యంలో.. ప్రత్యేకంగా దీపిక కి అవార్డు ఇవ్వడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నంది అవార్డుల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకొని కూర్చుంది. అలాంటి సమయంలో మంత్రి అఖిల ప్రియ.. ప్రభుత్వానికి మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నట్లు సమాచారం.