దేవతా విగ్రహాలను తొలగించిన అధికారులు
- దేవతా విగ్రహాల తొలగింపు
- హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ స్థానికుల ఆందోళన
- మద్దతు పలికిన వైసీపీ నేతలు
అధికారులు అనాలోచితంగా చేసిన ఓ పని కారణంగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అసలే కార్తీకమాసం.. భక్తులు అధిక సంఖ్యలో శివునికి పూజలు చేస్తుంటారు. అలాంటి శివలింగాన్ని అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
అసలేం జరిగిందంటే.. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న స్నానఘట్టంలో భక్తులు ఏర్పాటు చేసుకున్న శివలింగాన్ని అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టుపక్క గ్రామాల వారంతా అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే..పోలీసులు కూడా అధికారులకే
సహకారం అందించారు. దీంతో అధికారులు సునాయాసంగా విగ్రహాలను అక్కడి నుంచి తొలగించారు. విగ్రహాలను ఉన్న స్నానాల ఘట్టాన్ని ప్రభుత్వం పర్యాటక శాఖ కు అప్పగించింది. దానిని అభివృద్ధి చేయాలనే నెపంతో అధికారులు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు.
దీంతో.. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ పలువురు ఆందోళనకు దిగారు. తాము రోజూ పూజించే విగ్రహాలను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు.విగ్రహాల తొలగింపుపై గ్రామస్థులు చేస్తున్న ఆందోళనకు వైసీపీ నేతలు అండగా నిలిచారు. విగ్రహాల తొలగింపును అడ్డుకున్న ఇద్దరు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి బలవంతంగా శివలింగాన్ని, గణపతి, నంది విగ్రహాలతో పాటు, శివుడికి ప్రార్థన చేసే రావణబ్రహ్మ విగ్రహాలను తొలగించడానికి పూనుకున్నారు. తొలగించిన విగ్రహాలను వ్యాన్లో ధవళేశ్వరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయా నికి తరలించారు. రావణబ్రహ్మా విగ్రహాన్ని మాత్రం పూర్తిగా ధ్వంసం చేశారు.