అమెరికాలో భారత సంతతి తల్లీ, కొడుకుల హత్య
- అమెరికాలో భారత సంతతి తల్లీ కొడుకుల హత్య
- గన్ తో కాల్పులు జరిపి హత్య చేసిన దుండగులు
భారత సంతతికి చెందిన తల్లీ కొడుకులు హత్యకు గురైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వాషింగ్టన్ డిసి లో వీరిని గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. వర్జీనియా సబర్బన్ లోని ఓ ఇంట్లోని వారు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భారత సంతతికి చెందిన ప్రవాసి మహిళ మాలా మన్వాలీ(65), కొడుకు రిషి మన్వాలీ(32) తో కలిసి వర్జీనియాలో నివాసముంటోంది. అయితే గత రెండు రోజులుగా వీరు ఇంట్లోనుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వీరి నివసానికి చేరుకున్న పోలీసులు బుల్లెట్ గాయాలతో పడి వున్న రెండు మృతదేహాలు గుర్తించారు. దీంతో హత్యా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే ఈ తల్లి కొడుకుల హత్యలు జాతి విద్వేషం కారణంగా జరిగి వుంటాయని ప్రవాసీలు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం హత్యలకు జాతి వివక్షత కారణం కాదని, దోషులను పట్టుకున్నాక అసలు నిజాలు బయటపెడతామంటున్నారు.