కొత్త వేయి నోటు ముస్తాబవుతూ ఉంది...
కొత్త రంగుతో పాటు రద్ద యిన నోటు కంటే చిన్నదిగా ఉంటుంది
వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినా కేంద్రం వినడం లేదు. ఆయన రాసిన లేఖను కూడా పట్టించుకోకుండా, రిజర్వు బ్యాంకు తొందరల్లో కొత్త వేయి రుపాయల నోటును తీసుకువచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది.
అయితే,దీనికి రెండు మూడు నెలలు పట్ట వచ్చని రిజర్వు బ్యాంకు వర్గాలు తెలుపుతున్నాయి. రద్దయిన వేయి నోటు కంటే చిన్నదిగా కొత్త నోటును రూపొందిస్తున్నారు.
“ ఈ కొత్త వేయి నోటు నిజంగానే కొత్త డిజైన్ తో ముస్తాబవుతూ ఉంది. దీన్ని కాపీ చేసిన నకిలీగా అచ్చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే, లోలోపల సెక్యూరిటీ లక్షణాలు చాలా ఇముడ్చుకుని ఈ నోట్లు రాబోతున్నాయి,” అని రిజర్వు బ్యాంకు వర్గాలు తెలిపాయి.
అంధులు కూడా సులభంగా గుర్తు పట్టేలా (బ్రెయిలీ ఫ్రెండ్లీ) కొత్త వేయి నోటు ఉంటుందట. రంగు కూడా కొత్త దే. ఈ వివరాలు వెల్లడించడం లేదు.
మొదట్లో కొత్త వేయినోటును విడుదలచేసేందుకు చాలా నెలలు పడుతుందని అనుకున్నారు. అయితే, రెండు వేల నోటుతో చిల్లర సమస్య తీవ్రం కావడంతో, సాధ్యమయినంత తొందరగా విడుదల చేయాలని ఇపుడు నిర్ణయించారు. ముద్రణ ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి.