డిప్యూటి సీఎం కడియం సమక్షంలో ఎంపిటీసి ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లాలో ఘటన
డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఎదురుగానే ఓ ప్రజా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని గూడూరు మండలం బొల్లెపల్లి ఎంపిటిసి వెంకట్ రెడ్డి డిప్యూటి సీఎం సమక్షంలో బలవన్మరణ ప్రయత్నం చేశాడు. అయితే అతడిని అక్కడే వున్న కార్యకర్తలు కాపాడి ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గూడూరు మండలం బొల్లెపల్లి ఎంపిటిసి వెంకట్ రెడ్డి కొన్ని ప్రభుత్వ పనులను కాంట్రాక్ట్ కి తీసుకుని చేయించాడు. అయితే ఈ పనుల బిల్లులను అధికారులు పెండింగ్ లో పెట్టారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పెండింగ్ బిల్లులు రావడం లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకట్ రెడ్డి ఇవాళ డిప్యూటి సీఎం పర్యటనలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.