పులివెందులకు కృష్ణా జలాలొస్తున్నట్లు తెలుసా, జగన్ కళ్లున్న కబోది
రాయలసీమతో పాటు సొంతవూరు పులివెందులకు నీళ్లు వచ్చినా జగన్ కు కనిపించడం లేదంటే అర్థమేమిటి?
జగన్ కళ్లున్న కబోది అని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. మంత్రులు, శాసన సభ్యులలతో కలసి ఆమె ఈ రోజు పోలవరం ప్రాజక్టు నిర్మాణం పనులను పరిశీలించారు. తర్వాత ఈ బందం పట్టిసీమ ఎత్తిపోతలప్రాజక్టును చేరుకుంది. అక్కడ రాయలసీమ ప్రతినిధిగా ఆమె పట్టిసీమ తమ ప్రాంతానికి చేయబోతున్న మేలు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మీద త్రవస్థాయిలో విరుచుకు పడ్డారు. పట్టిసీమ, పోలవరం చారిత్రాత్మకం అని చెబుతూ ఈ ప్రాజక్టు రాయలసీమకు జీవనాడి అవుతుందని అన్నారు.
కృష్ణా, గోదావరి నదుల అనుసందానం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆమె ప్రశంసించారు. ఆయనను అపరభగీరథుడు అని కొనియాడారు.
‘రతనాలసీమ గా ఉన్న రాయలసీమ రాళ్లసీమగా మారిన సమయంలో పట్టిసీమతో నీళ్ల సీమగా మారనుంది. నదుల అనుసందానంతో కృష్ణాజలాలను వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నదుల అనుసంధానం ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. కేంద్రం నుంచి పోలవరానికి నిధులు తెచ్చి సకాలంలో పూర్తయ్యేలా కృషి చేస్తున్నారు.పట్టిసీమను రాయలసీమ నుండి అనేక మంది బస్సుల ద్వారా వచ్చి సందర్శిస్తున్నారు. మేము, మా రాయలసీమ ప్రజలు, రైతులు గోదావరి ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాం,’ అని చెప్పారు. ఇన్ని జరగుతున్న ప్రతిపక్ష నాయకుడు చూడలేకపోతున్నారని చెబుతూ జగన్ కళ్లున్న కబోది అని ఆమె అన్నారు.
నీటి విలువ తెలియకపోయినా జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని అంటూ రాయలసీమతో పాటు జగన్ మోహన్ రెడ్డి ప్రాంతమైన పులివెందులకు నీళ్లు వచ్చింది కనిపించడం లేదా అపి సునీత ప్రశ్నించారు.
రాయలసీమకు నీటిని తరలిస్తున్నారని గోదావరి ప్రాంత ప్రజలను జగన్ రెచ్చగొడుతున్నాని ఆమె ఆరోపించారు.
మరో 20 ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని జగన్ తెలుసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు.