యుపిలో బిజెపికి ముఖ్యమంత్రి అభ్యర్థి కరువు
ఉత్తర ప్రదేశ్ లో బిజెపికి సిఎం అభ్యర్థి లేకపోవడంతో ఎన్నికలు మోదీ - అఖిలేశ్ యాదవ్ మల్ల యుద్ధంగా మారాయి.
ఉత్తర ప్రదేశ్ లో బిజెపికి బొమ్మ సమస్య వచ్చింది.
అక్కడ కూడా బీహార్ సమస్యే ఎదురవుతూ ఉంది. ఎవరి బొమ్మ పెట్టి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తలపడాలి?
2014 తర్వాత బిజెపియేతర రాష్ట్రంలో కాషాయపార్టీకి ఎదురవుతున్న పెద్ద సమస్య ఇది. ఢిల్లీ ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో మోదీ బొమ్మ మాత్రమే పెట్టి, మరొక ఫోటో ఎవరిది లేకుండా తలపడి తల బొప్పి కట్టించుకుంది. ఈ రెండు దెబ్బల నుంచి ఇంకా కోలుకోలేదు, ఇపుడు నోట్లరద్దుతో మరొకసారి మొట్టికాయపడింది. ఇలాంటపుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలొచ్చాయి.
ప్రధాని మో దీ రాజకీయ భవితవ్యం పణంగా పెట్టి పోరాడుతున్న ఎన్నికలని యుపి ఎన్నికలకు పండితులు ఒక బ్రాండ్ తగిలించేశారు. అయితే,ప్రధాని బొమ్మ ఒక్కటే పెడితే, ఢిల్లీ, బీహార్ పరిస్థితి ఎదురవుతుందేమో ననే భయం పార్టీలో ఉంది. దీన్నెవరూ వ్యక్తంచేసే స్థితిలో లేరు. అలాగని మరొకరి బొమ్మ పెట్టడమంటే, ముఖ్యమంత్రి పదవికి ఎవరినైనా ఎంపిక చేసి, ఆ ప్రాంతీయ నాయకుడి ఇమేజ్ ను కూడా కలుపుకుని ఎన్నికల్లో తలపడటం అని అర్థం. ఇది సాధ్యంకాదు. ఎందుకంటే, ఆకాశ మంత ఎత్తున్న మనిషిగా మోదీని వూహించుకుని పూజిస్తూ ఉండటంతో, ఆయన పక్కన మరొక విగ్రహం పట్టేందుకు బిజెపి సాహసించడం లేదు. అసలు అలాంటి ఆలోచన కూడా చేయదు. మోదీ పక్కన మరొక బొమ్మ పెడితే,అ మేరకు మోదీ మాయ తొలగిపోయినట్లే లెక్క. ఈ వాస్తవం జన బాహళ్యంలోకి వెళ్లడం బిజెపి కి ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకుని, ఈ రెండో బొమ్మ సమస్యను అధిగమించేందుకు బిజెపి నాయకత్వం తెలివిగాముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడం మానేసింది.
బిజెపి పోస్టర్లలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తో ఫోటో ఆ స్థానం అక్రమించింది.
అయితే, పార్టీ నేతలకు తప్ప ప్రజలకు ఆకర్షణీయంగా కనిపించేంత బొమ్మ కాదు అమిత్ షా ది. అఖిలేశ్ లా చలాకయిన కుర్రవాడు కాదు ఆయన, కేజ్రీవాల్ లా గాయో ధుడూ కాదు, నితిష్ లాగా రాజకీయ నాయకుడూ కాదు.షా తెరచాటు రాజకీయాలు నెరపడం తప్ప యుద్ధబూమిలో పనిచేసిన వాడే మీ కాదు. కాకపోతే, అధికారం అండతో ఆయనను బిజెపిలో చాలా శక్తవంతుడిలాగా కనబడతాడు.
ఈ నకిలీ ఇమేజ్ కొంపముంచే ప్రమాదం కూడా ఉందనే భయంతో మరొక నలుగురు స్థానికుల బొమ్మలు కూడా ప్రధాని పోస్టర్లలో అచ్చేస్తున్నారు. వారు:కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ (ఠాకూర్), పార్టీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య (బిసి), మూడో వ్యక్తి కల్ రాజ్ మిశ్రా (బ్రాహ్మణుడు). నాలుగో బొమ్మ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి (బిసి).
ఈ బొమ్మలు పెట్టుకోవడమంటేనే, మోదీ బొమ్మకు ఓట్ల వశీకరణ శక్తి తగ్గిందనేగా అర్థం. ఒక ఠాకూర్, ఇద్దరు బిసి, ఒక బ్రాహ్మణుడి బొమ్మలు పెట్టుకుని ఓట్లడగాలనుకుంటున్నా, ఈ ముసలోళ్లలో ఎవ్వరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిని గా ప్రకటించేందుకు బిజెపి సిధ్ధంగా లేదు.
కాకపోతే, గెలిస్తే మనకులపోడు సిఎం అవుతరాని ఠాకూర్లు, బసిలు, బ్రాహ్మణులు ఓటేస్తారని ఆశ కల్పిస్తూ ఉంది.
అటూవైపు చాలా ఆకర్షణ ఉన్న కుర్రవాడు అఖిలేశ్ యాదవ్ యే ముఖ్యమంత్రి అభ్యర్థి అని సమాజ్ వాది పార్టీ ప్రకటించేసింది. దానికితోడు సర్వేలన్నీ అఖిలేశ్ యాదవే ముఖ్యమంత్రి అని చూపిస్తున్నాయి. అఖిలేశ్ కు ధీటైన నవతరం నాయకుడెవరూ బిజెపిలో లేరు. ఉన్న వాళ్లంతా సీనియర్ సిటిజన్లే. దీనితో ఈ ఎన్నికలు, మోదీ రాజకీయ భవిష్యత్తు కేకాదు, ఆయన నీడ అమిత్ షా కు సవాల్ గానే మారుతున్నాయి. మోదీ- షా జంటని ఉత్తర ప్రదేశ్ నిలబడుతుందా పడగొడుతుందా అనేది ప్రజల మధ్య కంటే బిజెపిలోనే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది.