హీరో రాజ్ తరుణ్ తండ్రికి జైలు శిక్ష
మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
సినీ హీరో రాజ్ తరుణ్ తండ్రికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.బ్యాంకులో పని చేస్తూ... నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రుణం పొందిన కేసులో రాజ్ తరుణ్ తండ్రి
నిడమర్తి బసవరాజు(53)ని న్యాయస్థానం దోషిగా తేల్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే...విశాఖపట్నంలోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు (53) సింహాచలం స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియాలో 2013లో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్గా విధులు నిర్వహించేవారు. అప్పట్లోనే తన భార్య రాజ్యలక్ష్మితో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఎం.ఎస్.ఎన్.రాజు, ఎన్.సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్.వెంకట్రావు పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో కుదువ(తాకట్టు)పెట్టి రూ.9.85 లక్షల రుణాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బ్యాంకు అధికారులు ఆడిట్ తనిఖీలు చేశారు. నకిలీ బంగారు వస్తువులు బయటపడడంతో బ్యాంకు మేనేజర్ గరికిపాటి సుబ్రహ్మణ్యం గోపాలపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ ఈదుల నరసింహారావు కేసు నమోదు చేసి కోర్టుకు నివేదిక అందజేశారు. విచారణ అనంతరం శుక్రవారం విశాఖపట్నం రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సన్నీపర్విన్ సుల్తానాబేగం తీర్పును వెల్లడించారు. నిందితుడు బసవరాజుకు మూడేళ్ల జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.