బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో సౌరవ్ గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో క్రికెట్ ప్రపంచం షాకింగ్ కు గురైంది.

ఇప్పుడు వారి స్థానాలలో ఎవరిని భర్తీ చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే బీసీసీఐ అధ్యక్ష పీఠానికి టీం ఇండియా మాజీ కెప్టెన్, కోలకత్ ప్రిన్స్ సౌరవ్ గంగూలీ పేరు బాగా వినిపిస్తుంది.

ప్రస్తుతం గంగూలీ క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

భారత క్రికెట్లో మొత్తం ఐదు జోన్లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. రొటేషన్ పద్దతి ప్రకారం మూడేళ్లకోసారి ఒక్కో జోన్ నుంచి బీసీసీఐ చీఫ్ ను ఎన్నుకుంటారు. గతంలో ఈస్ట్ జోన్ నుంచి శశాంక్ మనోహర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఐసీసీ కి వెళ్లడం , ఠాకూర్ పదవి ఊడడంతో ఇప్పుడు రేసులో గంగూలీ వచ్చాడు.

అయితే బీసీసీఐ అధ్యక్ష పదవికి సంబంధించి గంగూలీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, ప్రపంచంలోనే అత్యధిక ధనిక బోర్డు కావడంతో గంగూలీ అయితేనే బీసీసీఐని సమర్ధవంతంగా నడపగలడని క్రికెట్ ప్రపంచం భావిస్తోంది.