ఫోన్ కొట్టు గంజాయిపట్టు పాలసీ..
- హైదరాబాద్ నగరం మత్తు పదార్థాలను నిలయమైంది
- కేవలం ఒక ఫోన్ కొడితే చాలు.. గంజాయి ప్యాకెట్లను చేతిలో పెట్టి వెలుతున్నారు
హైదరాబాద్ నగరం మత్తు పదార్థాలను నిలయమైంది. కేవలం ఒక ఫోన్ కొడితే చాలు.. గంజాయి ప్యాకెట్లను చేతిలో పెట్టి వెలుతున్నారు. అదేదో పిజ్జా డెలివరీ చేసినంత సులభంగా ఇచ్చేస్తున్నారు. అది కూడా చిన్న పిల్లలు, యువతే ఈ గంజాయి ప్యాకెట్లను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.
గత కొద్ది రోజుల క్రితం మత్తు పదార్థాల వినియోగం గురించి తరచూ వార్తలు వినపడుతూ నే ఉన్నాయి. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని.. డ్రగ్స్ తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. పలువురిని సిట్ అధికారులు విచారించారు కూడా. దేశ వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. అయితే.. మత్తుకు బానిసలైన వారిలో పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కూడా ఉన్నారని తేలడంతో. .. దీనిపై పోలీసు అధికారులు మరింత దృష్టిసారించారు. హైదరాబాద్ నగర కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ మాఫియా గురించి దర్యాప్తు చేస్తుండగా.. వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి.
కేవలం ఒక ఫోన్ చేస్తే.. గంజాయిని అందజేస్తున్నారని వారి దర్యాప్తులో తేలింది. అంతేకాదు.. ఎక్కువగా యువత ఇందులో పాల్గొండటం గమనార్హం. వారికి కొంత డబ్బు ఆశ చూపించి.. వారి చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా దూల్ పేట, మెహదీపట్నం, నానక్ రామ్ గూడ ప్రాంతాల్లో ఇలాంటి పనులు జరుగుతన్నాయని పోలీసుల దృష్టికి వెళ్లింది. వారు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించగా.. ఒక 20 ఏళ్ల కుర్రాడు గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు.
గంజాయి సరఫరా చేసినందుకు తమకు రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తారని.. సరఫరా చేయాల్సిన ప్రాంత దూరాన్ని బట్టి డబ్బు ఇస్తారని ఆ యువకుడు తెలిపాడు. ఈ వ్యాపారమంతా కేవలం ఫోన్లలోనే నడుస్తుందని తేలింది.