చేతి వేళ్ల గోళ్లు కత్తిరిస్తా: త్రిపుర సిఎం మరో వివాదాస్పద వ్యాఖ్య
త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
న్యూఢిల్లీ: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. డయానా హెడెన్ 1997లో మిస్ వరల్డ్ గా ఎంపిక కావడంపై వివాదాస్పద వ్యాఖ్య చేసి ఆయన క్షమాపణలు చెప్పారు.
గతవారం రాష్ట్ర రాజధాని అగర్తాలాలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే నాడు ఆయన చేసిన ప్రసంగం వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. డయానాపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన గంటల వ్యవధిలోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
తన ప్రభుత్వంపై లేదా ప్రజానీకంపై ఎవరు కూడా వేలెత్తి చూపడానికి వీల్లేదని, విప్లవ్ దేవ్ ప్రభుత్వం కాదని, ప్రజానీకమే ప్రభుత్వమని ఆయన ఎడమ చేయి పైకెత్తి చూపుడు వేలును ప్రేక్షకుల వైపు ఊపుతూ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సందడి చేస్తోంది. ఆ సమయంలో సమావేశం గదిలో తీవ్రమైన నిశబ్దం చోటు చేసుకుంది.
"నేను యువకుడిగా ఉన్నప్పుడు .. ఇది ప్రభుత్వ ఆస్తి నువ్వు ఏమైనా చేయవచ్చు.... సొరకాయను చేసినట్లుగా చేయవచ్చు.. కూరగాయల విక్రయందారు ఉదయం 8 గంటలకే బజారుకు సొరకాయలు తెస్తాడు.. 9 గంటల సమయానికి దానిపై ఎన్నో గీతలు పడుతాయి. అది అమ్ముడుపోదు. దాన్ని ఆవుకు తినిపించాలి లేదా ఇంటికి తీసుకుని వెళ్లాలి. నా ప్రభుత్వం అలా ఉండదు. దానిపై ఎవరు కూడా గోళ్లతో రక్కిన గుర్తులు ఉండకూడదు. వాటిని గోళ్లతో రక్కే వాళ్ల గోళ్లు కత్తిరిస్తా" అని ఆయన అన్నారు.
డయానాను మిస్ వరల్డ్ గా ఎంపిక చేయడంపై గతవారం వ్యాఖ్యానిస్తూ ఆమె ఐశ్వర్యారాయ్ మాదిరిగా భారత సుందరి కాదని అన్నారు. అదే రకంగా సివిల్ సర్వీసెస్ కు మెకానికల్ ఇంజనీర్లు పనికి రారని, సివిల్ ఇంజనీర్లు మాత్రమే పనికి వస్తారని మరోసారి అన్నారు. యువకులు ప్రభుత్వోద్యోగాల కోసం చూడకూడదని, ఆపులను పెంచుకోవాలి లేదా పాన్ షాప్ పెట్టుకోవాలని అన్నారు.