ఇరాన్ లో భారీ భూకంపం.. 328మంది మృతి
- ఇరాన్, ఇరాక్ సరిహద్దులో భారీ భూకంపం
- పెరుగుతున్న మృతుల సంఖ్య
- సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు
ఇరాన్ దేశాన్ని భూకంపం అతలాకుతలం చేసింది. ఆదివారం రాత్రి ఇరాన్- ఇరాక్ సరిహద్దు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి ఇప్పటి 328 మంది మృత్యువాతపడగా.. మరో 1700మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు ఇరాక్ హలబ్జా నగరానికి 31కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్ లోని 14 ప్రావిన్స్ లలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
మళ్లీ ఎప్పుడు భూకంపం సంభవిస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. దీంతో పార్కుల్లో, వీధుల్లోనే తలదాచుకుంటున్నారు. మరో వైపు చలి ఎక్కువ ఉండటంతో పిల్లలు, ముసలివాళ్లు మరింత ఎక్కువ ఇబ్బందులకు గురౌతున్నారు.కొన్ని ప్రాంతాల్లో అధికారులు విధ్యుత్ సరఫరాని కూడా నిలిపివేశారు.
ఈ భూకంప ప్రభావం ఎక్కువగా ఇరాన్ లోని కెర్మన్ షాలో కనిపించింది. ఇప్పటి వరకు ఆ నగరంలో 98మంది వరకు మృత్యువాత పడ్డారు. ఈ నగరంలోని ప్రధాన ఆస్పత్రి కూడా కూలిపోవడంతో క్షతగాత్రులకు చికిత్స అందించడం కష్టతరంగా మారింది. తక్షణ వైద్యం అందక చాలా మంది ప్రాణాలను విడిచిపెడుతున్నారు. దీంతో క్షతగాత్రులను వేరే ప్రాంతంలోని ఆస్పత్రులకు హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు.
చాలా ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కూడా కూలిపోయాయి. దీంతో తినడానికి తండి, పసిపిల్లలకు పాలు, కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడ దొరకక అవస్థలుపడుతున్నారు. ఈ ప్రమాధ ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కువైట్ లోనూ...
కువైట్ లోనూ ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. అయితే.. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.