రూ.500కే 4జీ స్మార్ట్ ఫోన్లు
- ఇప్పటికే ఆఫర్లు ప్రకటించడంలో.. జియోతో పోటీపడుతున్న ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి టెలికాం సంస్థలు తాజాగా బడ్జెట్ ఫోన్లపై దృష్టి సారించాయి.
జియో అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత టెలికాం రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉచితంగా అన్లిమిటెడ్ ఫోన్కాల్స్, మెసేజ్లతోపాటు మొబైల్ డేటాలపై ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ కష్టమర్లను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా రూ.1500కే ఫీచర్ ఫోన్ను కూడా అందిస్తోంది. ఇప్పటికే ఆఫర్లు ప్రకటించడంలో.. జియోతో పోటీపడుతున్న ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి టెలికాం సంస్థలు తాజాగా బడ్జెట్ ఫోన్లపై దృష్టి సారించాయి. మొబైల్ తయారీ సంస్థలతో కలిసి రూ. 1500 కంటే తక్కువ ధరలోనే ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. అయితే తాజాగా రూ. 500కే 4జీ స్మార్ట్ ఫోన్లను తీసుకురావాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయట. ఇందుకోసం మొబైల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక.. నెలకు రూ.60 నుంచి 70 రీఛార్జ్ తోనే అధిక డేటా, వాయిస్ కాల్ ఆఫర్లను ఇవ్వాలని యోచిస్తున్నాయి. కాగా.. ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.