ప్రపంచమంతా ఏడుకొండల వాడి గుడుల నిర్మాణం
- ప్రపంచమంతా తిరుపతి వేంకటేశ్వర స్వామి గుళ్లను నిర్మించాలి
- కూచిపూడి నృత్యాన్ని అన్ని దేశాలకు విస్తరింపచేయాలి
- ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక సెజ్
తెలుగు సంస్కృతి, తెలుగు జాతి గురించి ప్రపంచమంతా తెలిసే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని క్యాంప్ఆఫీసులో ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు(ఏపీఎన్ఆర్టీ) పాలకమండలి తొలి సమావేశం జరిగింది. ఇందులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రెండు రకాల కార్యక్రమాలుంటాయి. ఒకటి తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయాలను ప్రపంచమంతా నిర్మించడం.రెండు, కూచిపూడి నృత్యాన్ని ప్రపంచనలుమూలలకి తీసుకుపోవడం.
అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. హర్యానా తరహాలో ఏపీఎన్ఆర్టీల కోసం స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ జోన్, ప్రత్యేక సెల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని కూడా ఆయన సూచనలిచ్చారు.
ఏపీఎన్ఆర్టీ పాలకమండలి సమావేశంలో మైగ్రేషన్ పాలసీకి ఆమోదం తెలిపారు. మైగ్రేషన్ పాలసీలో భాగంగా ప్రవాసాంధ్ర హెల్ప్లైన్, ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర సహాయ నిధి ఏర్పాటుచేస్తారు. ఏపీఎన్ఆర్టీ సభ్యులుగా చేరే అందరికీ ‘ప్రవాసాంధ్ర భరోసా’ కింద బీమా వసతి ఉంటుంది. ఉపాధి కోల్పోయే వారిని తక్షణం ఆదుకునేలా ప్రవాసాంధ్ర సహాయ నిధి ఏర్పాటు చేస్తారు. మైగ్రేషన్ పాలసీ అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది రూ. 40 కోట్ల కేటాయింపు. తక్షణం రూ. 20 కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.