తమ్ముడితో రాజకీయ విభేదాలే: రాహుల్ ఆఫర్ ను నో చెప్పిన చిరు

అమరావతి: తాను ఏం చేయాలనే విషయంపై మెగాస్టార్, కాంగ్రెసు నేత చిరంజీవి చాలా స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ తో ఆయనకు రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, పూర్తి స్థాయి రాజకీయాల్లో మునిగిపోగా, చిరంజీవి మాత్రం వాటికి దూరంగా ఉంటూ వస్తున్నారు.చిరంజీవి ఎక్కువ సమయం సినిమా షూటింగుకే కేటాయిస్తున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగులో ఆయన బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన కాంగ్రెసు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో గానీ ఇతర కార్యక్రమాల్లో గానీ పాలు పంచుకోలేదు. ప్రత్యేక హోదాపై కాంగ్రెసు పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు. అయితే, ఆ మధ్య కాలంలో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిరంజీవిని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోది. ఎఐసిసిని పునర్వ్యస్థీకరించిన సమయంలో చిరంజీవికి ప్రధానమైన స్థానం కల్పించడానికి రాహుల్ గాంధీ సిద్ధపడ్డారని తెలుస్తోంది. తాను సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నందున క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగలేనని, అయితే కాంగ్రెసును మాత్రం వీడేది లేదని చిరంజీవి రాహుల్ గాంధీకి స్పష్టం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత కాంగ్రెసు కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారని, వచ్చే ఎన్నికల సమయంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. చిరంజీవి వచ్చే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు తరఫున పాల్గొంటారని భావిస్తున్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలుగువాళ్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయన కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తారని అంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred