అమెరికాలో బుద్ధ విగ్రహం శిరచ్ఛేదం
- అమెరికా లాస్ ఎంజలీస్ శివార్లలో చేత్త వేయడాన్ని ఆపేందుకు రోడ్డు మీద ఎవరో బుద్ధడి విగ్రహం ప్రతిష్టించారు
- చెత్త వేయడం ఆగిపోయింది. అయితే, ఆగంతకుడెవరో బుద్ధుడి తల ధ్వంసం చేశాడు.
- స్థానికులు మరొక విగ్రహం నిలబెట్టారు.
- మళ్లీ ధ్వంసం... ఇలా నాలుగు సార్లు జరిగింది
ఇలాంటిది ఇండియా అంతా కనపడుతుంది. మూత్రం చేయరాదని, ఉమ్మేయరాదని చెబితే వినరు కాబట్టి దేవతల బొమ్మలు గోడల మీద పెయింట్ చేసి భయపెట్టేందుకు భారతీయులు ప్రయత్నిస్తుంటారు.
అయితే,ఇలాంటి సమస్య మనకే కాదు, అమెరికా లో కూడా ఉంది. కాకపోతే, మూత్రం, ఉమ్మేయ్యడంలో కాదు, చెత్త వేయడంలో.అమెరికా లాస్ ఎంజలీస్ శివార్లలో పామ్ వద్ద నేషనల్ బోల్వార్డ్, జాస్మిన్ ఎవెన్యూ మధ్య ఉండే ట్రాఫిక్ ఐలండ్ చెత్త దిబ్బలాగ మారిపోయింది. అక్కడి ప్రజలు కూడా ఇండియన్లలాగే చెత్త తీసుకు వచ్చి అక్కడేయడం మొదలుపెట్టారు. చినిగిపోయిన పరుపులు,పాత ఫర్నిచర్ ఒకటేమిటి, ఇళ్లలో ఉండే పనికి మాలినిదాన్నంత ఇక్కడేయడం మొదలుపెట్టారు.
అయితే, ఉన్నట్లుండి ఒక రోజు ట్రాఫిక్ ఐలండ్ మధ్య చక్కటి బుద్ధ విగ్రహం ప్రత్యక్ష మయింది. పొద్దునే చూసే సరికి ఒక అరుగు మీద బుద్ధభగవానుడున్నాడు. ఎవరు పెట్టారు, అదెక్కడి నుంచి వచ్చిందనేది ఎవరికీ తెలియదు.చుట్టుపక్కల ప్రజలంతా దీనిని చాలా పవిత్రమయినదిగా భావించారు. బుద్ధుడికి పూలు, కొవ్వొత్తులు, ఇతర కానుకలు, దక్షిణలు సమర్పించడం కూడా మొదలుపెట్టారు. అంతేకాదు, ఒక్కసారి చెత్త వేయడం ఆగిపోయింది. స్థలం శుభ్రమయింది. అక్కడున్న ప్రజలు కూడా సంతోషించారు.
అయితే, పోయిన్నెలలో ఒక రోజు సాయంకాలం ఒక వాహనం దురుసుగా అక్కడొచ్చి ఆగింది. ఆగంతడొకరుచేతిలో సుత్తితో దిగాడు. అంతా చూస్తుండగానే బుద్ధుడి తల విరగ్గొట్టి వెళ్లిపోయాడు. చాలా మంది ఈ విధ్వంసం చూసినా వాహనం నంబర్ నోట్ చేసుకోలేక పోయారు. పోతూ పోతూ అతనేదో నినాదాలు చేయడం వినిపించిందని కొందరంటున్నారు. ఇదేమిటో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
అయితే, మోటార్ ఎవెన్యూ అసోషియేషన్ వారు కొత్త బుద్ధడిని నిలబెట్టారు. ఈ సారి తల ఎగిరిపోకుండాలోహపు కడ్డి అమర్చారు. ఆగంతకుడు మరొక సారి ప్రయత్నం చేశారు. ఇలా నాలుగు సార్లు విగ్రహం పగలగొట్టాడు. ఎన్నిసార్లు పగలగొట్టినా కొంత మంది స్థానికులు అంతే కసిగా బుద్ధుడి విగ్రహం పున:ప్రతిష్టించడం మానలేదు.
ఈ సారి ఒక ఐదు వేల డాలర్ల నిధి పోగు చేసి అక్కడ మరొక విగ్రహం పెట్టి, రాక్ గార్డెన్ డెవెలప్ చేసి, సిసి కెమెరాలను ఏర్పాటుచేయాలని కొంత మంది స్థానికులు నిర్ణయించారని లాస్ ఎంజలీస్ టైమ్స్ పేర్కొంది.