జీతాలు పెంచలేం
- హోంగార్డుల ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది
- హోంగార్డులను క్రమబద్ధీకరిచలేమన్న ప్రభుత్వం
- జీతాలు కూడా పెంచలేమన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
హోంగార్డుల ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని హోంగార్డులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వారి ప్రతిపాదనను వాయిదా వేస్తూ వస్తోంది. కాగా మంగళవారం చావు కబురు చల్లగా చెప్పినట్లు శాసనసభలో ఈ విషయంపై ఉపముఖ్యమంత్రి చినరాజప్ప స్పందించారు.
హోంగార్డులను క్రమబద్ధీకరణ చేసే అవకాశం లేదని చినరాజప్ప చెప్పారు. ఈ రోజు శాసనసభలో ఆయన ఈ విషయం గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనందున ప్రస్తుతం జీతభత్యాలను కూడా పెంచలేమని చినరాజప్ప స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల అంశంగా హోంగార్డుల జీతభత్యాల పెంపుపై చర్చ చోటుచేసుకుంది. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఈ అంశాన్ని 74వ నిబంధన కింద ప్రస్తావించారు. గతంలో హోంగార్డులకు ఉన్న రూ.300 దినసరి వేతనాన్ని ప్రస్తుతం రూ.400కు పెంచినట్లు చినరాజప్ప తెలిపారు. వీరి సర్వీసులను సుప్రీంకోర్టు కూడా స్వచ్ఛంద సేవగా గుర్తించిందని, ఈ తరుణంలో వారిని క్రమబద్ధీకరించే ఆలోచన లేదన్నారు.