ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్.. రూ.1,799మాత్రమే
- అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన ఎయిర్ టెల్
- జియోకి పోటీగా విడుదల చేసిన ఎయిర్ టెల్
దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్, కార్బన్ మొబైల్స్ సంయుక్తంగా రెండు కొత్త ఆండ్రాయిడ్ 4జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. జియో ఫీచర్ ఫోన్కు పోటీగా అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ను తీసుకురానున్నట్లు ఎయిర్టెల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్బన్ మొబైల్స్ తో ఒప్పందం చేసుకుంది. తాజాగా ‘ఏ1 ఇండియన్’, ‘ఏ41 పవర్’ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఏ1 ఇండియన్ 4జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.4,390 కాగా, రూ.1,799కే అందిస్తోంది. ఇక ‘ఏ41 పవర్’ 4జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.4,290 కాగా, రూ.1,849కే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.
స్మార్ట్ ఫోన్ను ప్రతి ఒక్కరూ వినియోగించాలనే ఇంత తక్కువ ధరకు అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో రాజ్ పూడిపెద్ది చెప్పారు. ఇందు కోసం కార్బన్ కంపెనీతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఫోన్లు ఆమెజాన్ లో కొనుగోలు చేయవచ్చని ఆయన వివరించారు.