బీడీ ఇవ్వలేదని వ్యక్తి దారుణ హత్య.. ఇద్దరి అరెస్ట్..
బీడీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీడీ ఇవ్వమంటే ఇవ్వలేదని ఓ వ్యక్తిని ఇద్దరు అన్నాదమ్ములు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం దర్యాగంజ్లో వెలుగులోకి వచ్చింది. మృతుడు 25యేళ్ల వ్యక్తిగా గుర్తించారు. చెత్త ఏరుకుంటూ జీవించే వ్యక్తి అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హత్యకు పాల్పడిన ఇద్దరు సోదరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులను సెంట్రల్ ఢిల్లీలో నివసించే శివమ్ (21), మోహిత్ (19)గా గుర్తించారు. వీరిద్దరూ కూడా చెత్త, పాతకాగితాలు ఏరుకునేవారే. వీరు డ్రగ్స్కు బానిసలయ్యారని పోలీసులు తెలిపారు. బాధితుడు ఎవరు అనేది ఇంకా గుర్తించలేదని తెలిపారు. ఈ హత్య విషయం పోలీసు కంట్రోల్ రూంకు కాల్ వచ్చిందని, దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందండంతో అక్కడి ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనా స్థలంలో ఒక వ్యక్తి కత్తిపోటుకు గురైనట్లు గుర్తించారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్థారించారు.
ఈ ఘటన మీద డీసీపీ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ మాట్లాడుతూ, సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు అనుమానితులను నేరం జరిగిన ప్రదేశంలో గుర్తించాం. వీరికోసం బృందాలుగా విడిపోయి వివిధ ప్రదేశాలలో వెతికాం. దాదాపు 50 మందిని విచారించాం. చివరికి వారిద్దరినీ గుర్తించాం. నిందితులిద్దరినీ ఢిల్లీ గేట్ దగ్గర పట్టుకున్నామని ఆమె తెలిపారు. ఈ సోదరులిద్దరూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెత్త ఏరుకుంటుంటారు.
సోమవారం నాడు కూడా ఇదే క్రమంలో వారు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.15 గంటల మధ్య ఢిల్లీ గేట్లో చెత్త ఏరుకోవడానికి వచ్చారు. బాధితుడు కూడా చెత్తఏరుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో "నిందితుల్లో ఒకరు బీడీ కావాలని అడిగారు, కానీ అతను ఇవ్వడానికి నిరాకరించాడు, దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది, అది గొడవగా మారింది" అని పోలీసులు తెలిపారు.
తర్వాత, బాధితుడు ఆ సోదరులిద్దర్నీ తిట్టాడు. చెంపదెబ్బ కొట్టాడు.
దీంతో ఖంగుతిన్న నిందితులు అప్పటికి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత తిరిగి వచ్చి బాధితుడిని వెంబడించడం మొదలుపెట్టారు. "ఒక నిర్మానుష్యప్రదేశంలోకి రాగానే, మోహిత్ అతని చేతులను పట్టుకున్నాడు, శివమ్ అతని ఛాతీ, పక్క భాగాల్లో కత్తితో పొడిచాడు. ఆ తరువాత ఇద్దరూ పారిపోయారు" అని పోలీసులు తెలిపారు. నిందితులు ఇంతకు ముందు ఏదైనా నేరానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.