వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగస్టు రోజు అసలేం జరిగింది.?
Vande Mataram: స్వాతంత్ర దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ గీతం మార్మోగిన వేళ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సంఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. అసలు ఆగస్టు 15న ఏం జరిగిందంటే.?

ఆగస్టు 15న కాంగ్రెస్ కార్యాలయంలో అసలేం జరిగింది?
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించారు. అయితే సాధారణంగా వినిపించే తొలి భాగంతో ఆపకుండా గీతాన్ని పూర్తి రూపంలో ఆలపించడం ఈసారి ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.
గీతం కొనసాగుతున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గే వైపు చూస్తూ కొన్ని సంజ్ఞలు చేయడం వీడియోలో కనిపించింది. దీంతో సోనియా గాంధీ ‘వందేమాతరం’ ఆలాపనను ఆపాలని సూచించారని పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. బీజేపీ సైతం కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేయడం మొదలు పెట్టింది. ఈ ఆరోపణలతో వివాదం ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది.
సోనియా గాంధీపై బీజేపీ ఆరోపణలు ఏంటి?
వీడియోను ఆధారంగా చేసుకున్న బీజేపీ నేతలు కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ‘వందేమాతరం’ దేశ స్వాతంత్ర పోరాటంతో ముడిపడిన జాతీయ గీతం కావడంతో దాన్ని పూర్తిగా ఆలపించడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశభక్తి భావాలను దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో జరిగిన కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోనియా గాంధీ పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనను ఆపాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ జాతీయ గేయాన్ని అవమానించిందని విమర్శిస్తూ.. ఇందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ విషయాన్ని క్షమించరని అన్నారు. బీజేపీకి చెందిన పలువురు ఇతర నేతలు కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీ నేతలు, ఎంపీలు సోనియా గాంధీ తీరును ప్రశ్నించారు.
బంకిమ్ చంద్ర వారసుడి ఆవేదన.. సోనియాకు లేఖ
ఈ వివాదంపై పశ్చిమ బెంగాల్లోని నైహాటి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో ఛటర్జీ కూడా స్పందించారు. ‘వందేమాతరం’ రచయిత బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ కుటుంబ వారసుడిగా తనకు ఈ పరిణామం మరింత బాధ కలిగించిందని పేర్కొన్నారు. సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. స్వాతంత్ర దినోత్సవం వంటి సందర్భంలో ‘వందేమాతరం’కు సంబంధించిన వివాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. ఈ గీతం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని.. స్వాతంత్ర ఉద్యమ చరిత్రతో దీనికి విడదీయరాని సంబంధం ఉందని పేర్కొన్నారు.
1937లో కాంగ్రెస్ నాయకత్వం ‘వందేమాతరం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే జాతీయ కార్యక్రమాల్లో ఉపయోగించాలన్న నిర్ణయాన్ని తీసుకున్న చారిత్రక నేపథ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అప్పటి పరిస్థితులను నేటి ఘటనతో అనుసంధానిస్తూ కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై దేశ ప్రజలకు, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని సుమిత్రో ఛటర్జీ డిమాండ్ చేశారు. జాతీయ భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో రాజకీయ లాభనష్టాల కంటే చారిత్రక గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చిన సమాధానం ఏంటంటే.?
బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ ‘వందేమాతరం’ను ఆపాలని ఎలాంటి సూచన చేయలేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాలాసేపు నిలబడి ఉన్నారని.. ఆయన కోసం కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ సూచించారని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. వీడియోలో కనిపించిన ఆమె సంజ్ఞలను ‘గీతాన్ని ఆపాలని చేసిన సూచన’గా బీజేపీ తప్పుగా అర్థం చేసుకుంటోందని పార్టీ నేతలు చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు.. మరింత ముదిరిన రాజకీయ వివాదం
వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. ఆగస్టు 16న కర్ణాటకలోని ఉర్వా పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ‘వందేమాతరం’ ఆలాపనకు సంబంధించిన ఘటనను ప్రస్తావిస్తూ ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బీజేపీ నేతలు కాంగ్రెస్పై విమర్శలు కొనసాగిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను రాజకీయంగా సృష్టించిన వివాదంగా కొట్టేస్తోంది. దీంతో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక వీడియో క్లిప్ చుట్టూ మొదలైన చర్చ.. ఇప్పుడు ‘వందేమాతరం’ చరిత్ర, జాతీయ భావన, కాంగ్రెస్ గత వైఖరి, ఓటు బ్యాంకు రాజకీయాలు వంటి అంశాలపై పెద్ద రాజకీయ పోరుగా మారింది.

