Asianet News TeluguAsianet News Telugu

పాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల.. శ్వేత విప్లవ పితామహుడు కురియన్ గురించి ఈ విషయాలు తెలుసా..?

భారతదేశంలో అధిక పాల ఉత్పత్తి‌లో చోటుచేసుకున్న గణనీయమైన మార్పును శ్వేత విప్లవంగా పేర్కొటారు. పాల ఉత్పత్తిలో స్వయంప్రతిపత్తి సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేశంలో శ్వేత విప్లవ పితామహుడుగా వర్గీస్ కురియన్‌ను పేర్కొంటారు. 

You should know Verghese Kurien who is Father of the White Revolution
Author
First Published Aug 8, 2022, 6:46 PM IST

భారతదేశంలో అధిక పాల ఉత్పత్తి‌లో చోటుచేసుకున్న గణనీయమైన మార్పును శ్వేత విప్లవంగా పేర్కొటారు. పాల ఉత్పత్తిలో స్వయంప్రతిపత్తి సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేశంలో శ్వేత విప్లవ పితామహుడుగా వర్గీస్ కురియన్‌ను పేర్కొంటారు. శ్వేత విప్లవాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా పిలుస్తారు.అసలు దేశంలో శ్వేత విప్లవం మొదలైంది.. పాల ఉత్పత్తి పెరగడంలో వర్గీస్ కురియన్ పాత్ర ఏమిటో ఇప్పుడు చుద్దాం.. వర్గీస్ కురియన్ కేరళలోని కోజికోడ్‌లో 1921 నవంబర్ 26న జన్మించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో విద్యను అభ్యసించారు. గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చేరడానికి ముందు మెకానికల్ ఇంజనీర్‌గా అర్హత సాధించారు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌పై మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. 1948లో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు.

1949లో యునైటెడ్ స్టేట్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనను గుజరాత్ ఆనంద్‌లోని ఒక పాల ఉత్పత్తుల కేంద్రంలో నియమించింది. అక్కడ ఆయన డెయిరీ విభాగంలో అధికారిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు. అక్కడ రైతులను ఏకం చేసి సహకార ఉద్యమాన్ని ఏర్పాటు చేసేందుకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న త్రిభువందాస్ పటేల్‌ను కలిశారు. ఆ వ్యక్తి నుండి ప్రేరణ పొందిన కురియన్ అతనితో కలిసి పనిచేయాలని భావించారు. 

ఈ క్రమంలోనే అమూల్ సహకార సంస్థ ఏర్పాటైంది. కురియన్ స్నేహితుడు, డెయిరీ నిపుణుడు హెచ్‌ఎం దాలయ గేదె పాల నుంచి పాల పొడి, ఘనీకృత పాలను తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఇది భారతీయ పాడి పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చింది, అప్పటి వరకు ఇటువంటి ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులు.. ఆవు పాలతో మాత్రమే తయారు చేయవచ్చు. అమూల్ డెయిరీ చాలా విజయవంతమైంది. ఈ విధానం గుజరాత్‌లో ఇతర జిల్లాలకు కూడా వేగంగా వ్యాపించింది. 

You should know Verghese Kurien who is Father of the White Revolution

ఈ విజయవంతమైన పని.. అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని.. 1965లో జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB)ని స్థాపించి దేశంలోని అన్ని మూలలకు సహకార కార్యక్రమాన్ని విస్తరించడానికి ప్రేరేపించింది. కురియన్‌ను ఎన్‌డీడీబీ సంస్థ ఛైర్మన్‌గా నియమించారు. అధిక పాల ఉత్పత్తికి 1970లో రైతుల సహకారంతో ఆపరేషన్ ఫ్లడ్‌ను ప్రారంభించారు. 1979లో ఆయన సహకార సంస్థలకు నిర్వాహకులను గ్రూమ్ చేయడానికి ఆనంద్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. 

శ్వేత విప్లవంలో మొదటి దశ 1970లో ప్రారంభమై 1980లో ముగిసింది. పాల ఉత్పత్తిలో వేగం పెంచడం కోసం ఈ దశలో దేశంలో అధికంగా పాలు ఉత్పత్తయ్యే ప్రాంతాలను ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో అనుసంధానం చేశారు. రెండో దశ 1981 లో మొదలై 1985లో ముగిసింది. ఈ దశలో ప్రధాన పాల ఉత్పత్తి ప్రాంతాలు 18 నుంచి 136కు పెరిగాయి. 1985 చివరి నాటికి, 4,250,000 మంది పాల ఉత్పత్తిదారులతో 43,000 గ్రామ సహకార సంఘాల స్వయం-స్థిరమైన వ్యవస్థ కవర్ చేయబడింది. మూడో దశ 1986లో ప్రారంభమై 1996లో ముగిసింది. ఈ దశలో పాడిపరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలతోపాటు పాల సహకార సంఘాల సంఖ్య పెరిగింది. ఈ దశలో 30000 కొత్త డెయిరీల ఏర్పాటుతో సహకార సంఘాల సంఖ్య 73000కి చేరింది.

ఇక, వర్గీస్ కురియన్‌‌ను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 1965లో కురియన్ రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు. వర్గీస్ కురియన్‌ను మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇక, కురియన్ 2012లో అనారోగ్యంతో కన్నుమూశారు.

Follow Us:
Download App:
  • android
  • ios