మహిళలపై జామా మసీదు ఆంక్షలు.. పురుషులు వెంట లేకుండా ఒంటిగా వస్తే నో ఎంట్రీ
జామా మసీదు మహిళలపై ఆంక్షలు విధించింది. పురుషులు వెంట లేకుండా ఒంటిగా వస్తే మసీదులోకి నో ఎంట్రీ అని పేర్కొంది. ఇది కేవలం ఒంటిగా మసీదులోకి వచ్చే వారిపైనే అని, కుటుంబంతో వచ్చే వారిపై ఎలాంటి ఆంక్షలు లేవని వివరించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని జామా మసీదు చాలా ఫేమస్. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఆ మసీదును దర్శించుకునేవారు. తాజాగా, ఈ మసీదు మహిళలపై ఆంక్షలు విధించింది. పురుషులు వెంట లేకుండా ఒంటరి మహిళ ఈ మసీదులో రావడం కుదరదని స్పష్టం చేసింది. ఒంటరి మహిళలకు ఈ మసీదులోకి ఎంట్రీ లేదని ఓ నోటీసు మసీదు ముందు ఎంట్రెన్స్ గేటు దగ్గర అంటించారు. ఎవరైనా ఒక మహిళ జామా మసీదులోకి వెళ్లాని భావిస్తే.. తప్పకుండా ఆమె తన కుటుంబానికి చెందిన పురుషుడితో కలిసే రావాలని స్పష్టం చేసింది. కుటుంబంతో కలిసి వచ్చే మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని వివరించింది.
పురుషులు వెంట లేకుంటే.. ఒంటరిగా ఒక మహిళ మసీదులోకి రాకుండా నియంత్రించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ దీనిపై స్పందించారు. తాము జామా మసీదు అడ్మినిస్ట్రేషన్కు నోటీసులు పంపిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదని ట్వీట్ చేశారు.
Also Read: జామియా మసీదులో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
కాగా, జామా మసీదు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబివుల్లా ఖాన్ ఈ ఆంక్షలను సమర్థించారు. మసీదులోకి వచ్చే ఒంటరి మహిళలు అభ్యంతరకర పనులు చేస్తున్నారని, వీడియోలు తీస్తున్నారని, టిక్ టాక్ వీడియోలు తీస్తున్నారని, టైమ్ పాస్ చేయడానికి, లేదా ఎవరినో కలవడానికి ఈ మసీదును ఎంచుకోవడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనుల వల్ల ప్రార్థనలు చేసే వారికి ఇబ్బంది తలెత్తుతున్నదని పేర్కొన్నారు. ఏ మతప్రదేశమైనా.. మసీదైనా, మందిరమైనా ప్రార్థనల కోసం వస్తేనే బాగుంటుందని, మసీదు ఎందుకు ఉన్నదో ఆ లక్ష్యం అమలయ్యేలా ఉండాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అయితే, తాము మహిళలపై నిషేధం విధించలేదని, ఒంటిగా వచ్చే మహిళలపైనే ఆంక్షలు విధించామని చెప్పారు. కుటుంబంతో వచ్చే మహిళలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు.