ఉగ్రవాదాన్ని నిర్మూలించేవరకు విశ్రమించం: గ్లోబల్ మీట్ ఆన్ టెర్రర్ ఫండింగ్ లో మోడీ
గ్లోబల్ మీట్ ఆన్ టెర్రర్ ఫండింగ్ పై న్యూఢిల్లీలో ఇవాళ జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో నిర్మూలించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.
శుక్రవారంనాడు న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ మీట్ ఆన్ టెర్రర్ ఫండింగ్ పై జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.ఉగ్రవాదం ప్రమాదాల గురించి ప్రపంచానికి తెలపాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.దశాబ్దాలుగా పలు రూపాల్లో ఉగ్రవాదం భారత్ ను దెబ్బతీయడానికి ప్రయత్నించిందన్నారు.
అయితే ఉగ్రవాదాన్ని ఇండియా ధైర్యంగా ఎదుర్కొందని మోడీ గుర్తు చేశారు.ఉగ్రవాదుల దాడుల్లో ఒక్కరు మరణించినా ఎక్కువేనన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో నిర్మూలించేవరకు విశ్రమించబోమని ప్రధాని తేల్చి చెప్పారు.ఉగ్రవాదం గురించి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి కొత్తగా తెలపాల్సిన అవసరం లేదన్నారు.రాడికలైజేషన్ , తీవ్రవాద సమస్యను సంయుక్తంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. రాడికలైజేషన్ కు మద్దతిచ్చేవారికి ఏ దేశంలోనూ కూడా స్థానం ఉండకూడదని ఆయన కోరారు.టెర్రర్ ఫైనాన్సింగ్ మూలాన్ని దెబ్బకొట్టాల్సిన అవసరం ఉందని మోడీ నొక్కి చెప్పారు. నిరంతరం ముప్పులో ఉన్న ప్రాంతాన్ని ఎవరూ కూడా ఇష్టపడరని ప్రధాని చెప్పారు.ఉగ్రవాదం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారన్నారు. మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై ఉగ్రవాదం దాడి చేస్తుందన్నారు.. ప్రపంచానికి ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిదని చెప్పారు.. ఉగ్రవాదంపై పోరులో అస్పష్టమైన విధానానికి చోటు లేదన్నారు ప్రధాని మోడీ.