సారాంశం
సున్నా రైలు ప్రమాదాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘కవచ్’ టెక్నాలజీ ఒడిశా రైలు ప్రమాదాన్ని ఆపలేకపోయింది. ఈ ఘటనలో మరణాల సంఖ్య భారీగా ఉండటంతో ఇప్పుడు ఎంతో మందికి ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ట్విట్టర్ లో పలువురు యూజర్లు కేంద్ర రైల్వే మంత్రిపై ఈ విషయంపై ప్రశ్నిస్తున్నారు.
ఒడిశా రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 238 మంది మరణించినట్టుగా రైల్వే అధికారికంగా ప్రకటించింది. కానీ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనలో 900 మందికి పైగా గాయపడ్డారు. గత 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా చెబుతున్న ఈ ఘటనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ‘కవచ్’ టెక్నాలజీ ఎందుకు దీనిని ఆపలేకపోయిందని అనేక మంది ట్విట్టర్ యూజర్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ప్రశ్నిస్తున్నారు.
ఏమిటీ ‘కవచ్’ టెక్నాలజీ ?
కవచ్ అనేది రైలు ప్రమాదాలను నివారించడానికి భారతదేశంలో అభివృద్ధి చేసిన యాంటీ-కొలిషన్ టెక్నాలజీ. సున్నా ప్రమాదాలే లక్ష్యంగా ఈ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేశారు. సాధారణంగా ఎప్పుడైనా రైలు అనుమతి లేకుండా వెళ్లినప్పుడు లేదా స్టాప్ అని సిగ్నల్ వచ్చినా పట్టించుకోకుండా రైలు కదిలినప్పుడు సిగ్నల్ వస్తుంది. అయితే లోకో పైలట్ దానిని ట్రైన్ ఆపాల్సి ఉంటుంది. కానీ ఒక వేళ లోకో పైలట్ అది గమనించకుండా, లేకపోతే ట్రైన్ ను ఆపడంలో విఫలం అయితే ఆటోమేటిక్ బ్రేక్ అప్లికేషన్ ద్వారా కవచ్ రక్షణ వ్యవస్థ రైలు వేగాన్ని ఒక్క సారిగా నిలిపివేస్తుంది. ఇది అధిక ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ని ఉపయోగించడం ద్వారా పని చేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించింది.
అమిత్ షా విజ్ఞప్తికి భారీ స్పందన.. మణిపూర్ లో 140కి పైగా ఆయుధాలు సరెండర్..
కవచ్ టెక్నాలజీని మరింత సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఎఎస్) లేదా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) సిస్టమ్ అని పిలుస్తారు. రైలు ప్రమాదాల సంఖ్యను సున్నాకు తగ్గించడమే దీని లక్ష్యం. ఈ సాంకేతికత ఎస్ఐఎల్ 4 సర్టిఫికేషన్ కూడా పొందింది. దీని వల్ల ప్రమాదాలు జరగవని, 10,000 సంవత్సరాలలో ఒక శాతం మాత్రమే దోష అవకాశం ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో ప్రకటించారు. 2022-23లో ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద ఈ టెక్నాలజీని తీసుకువస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం 2022-23 నాటికి 2,000 కిలోమీటర్ల రైలు నెట్ వర్క్ ను స్వదేశీ ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ‘కవచ్’ పరిధిలోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రకటనలో తెలిపారు.
మరి ‘కవచ్’ ఫెయిల్ అయ్యిందా ?
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీకొనడంతో సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని ప్రాథమిక నివేదికలు సూచించినప్పటికీ.. రైల్వే అధికారులు దీనిని ఖండించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బెంగళూరు- హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12864) రైలు పట్టాలు తప్పి కోరమండల్ ఎక్స్ ప్రెస్ వెళ్తున్న ట్రాక్ ను దాటింది. దీంతో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సమీపంలో ఆ కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో ఆ మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
ఎంపీగా కాదు.. మహిళగా చెబుతున్నా.. రెజ్లర్లకు న్యాయం చేయండి - బీజేపీ నేత ప్రీతమ్ ముండే
అయితే రైలు పట్టాలు తప్పిన ఇలాంటి కేసుల్లో ‘కవచ్’ టెక్నాలజీ పని చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. దీనిని రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా ఢీకొనకుండా చూసుకునేందుకు రూపొందించారు. అందుకే ఈ రైలు ప్రమాదాన్ని ఆ టెక్నాలజీ ఆపలేదని తెలుస్తోంది. అయితే ఈ ‘కవచ్’ టెక్నాలజీ ఇంకా అన్ని అన్ని నెట్ వర్క్ లలో ఇన్ స్టాల్ చేయలేదని మరో వాదన వినిపిస్తోందని ‘జీ న్యూస్’ నివేదించింది.