presidential election 2022: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఛాన్స్ .. ఎవరీ ద్రౌపది ముర్ము..?
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే పక్షాల అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ... ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించారు
ఎట్టకేలకు సస్పెన్స్కు తెరపడింది. రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్ష అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పేరు ఖరారైన నేపథ్యంలో ఎన్డీఏ ఎవరినీ నిలబెడుతుందా అన్న చర్చ జరిగింది. దీనిపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మంగళవారం సాయంత్రం సమావేశమైంది. ఈ సందర్భంగా 20 మంది పేర్లు చర్చకు వచ్చాయి. చివరికి గిరిజన నేత , మాజీ జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును బీజేపీ నేతలు ఖరారు చేశారు. భేటీ ముగిసిన అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది పేరును ప్రకటించారు. దీంతో ఆమె ఎవరు... రాజకీయ ప్రస్థానం ఏంటీ అన్న దానిపై నెటిజన్లు ఇంటర్నెట్ను జల్లెడ పడుతున్నారు.
ALso Read: presidential election 2022: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము
ద్రౌపది ముర్ము ప్రస్థానం:
1958 జూన్ 20న పుట్టిన ద్రౌపది ముర్ము.. బీఏ వరకు చదువుకున్నారు. శ్యామ్ చరణ్ ముర్మును పెళ్లాడిన ఈమెకు ఒక కుమార్తె వున్నారు. ఒడిశా ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించిన.. ద్రౌపది అనంతరం 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాయ్రంగాపూర్ నుంచి కౌన్సిలర్గా గెలుపొందారు. 1997లో ఒడిశా బీజేపీ ఎస్టీ మోర్చా విభాగానికి ఉపాధ్యక్షరాలిగా పనిచేశారు.
2000లో తొలిసారి రాయ్రంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002-09 వరకు బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు. 2004లో మరోసారి రాయ్రంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006 నుంచి 2009 వరకు బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చాకు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.
2007లో ఎమ్మెల్యేగా అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ‘‘నీలకంఠ అవార్డ్’’ను అందుకున్నారు ద్రౌపది. 2010 నుంచి 2015 వరకు మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013 నుంచి 2015 వరకు బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా విధులు నిర్వర్తించారు.