presidential election 2022: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే పక్షాల అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే పక్షాల అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ... ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించారు. అనేకమంది పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిగా ఎంపిక చేసింది బీజేపీ. జార్ఖండ్ గవర్నర్గా ఇటీవలే ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు ద్రౌపది ముర్ము.
2015 మేలో జార్ఖండ్ గవర్నర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. 2000లో రాయ్రంగాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒడిశా బీజేపీ ఎస్టీ శాఖ అధ్యక్షురాలిగా, ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ద్రౌపది పనిచేశారు. అలాగే మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగానూ ఆమె విధులు నిర్వర్తించారు.
ఇకపోతే.. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. మంగళవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అధికారికంగా ప్రకటించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అని మేం (ప్రతిపక్ష పార్టీలు) ఏకగ్రీవంగా నిర్ణయించాం’’ అని జైరాం రమేష్ తెలిపారు. ఇక, జూన్ 27న ఉదయం 11.30 గంటలకు యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నారు.