Asianet News TeluguAsianet News Telugu

కలుషిత రాజధానితో ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నాం.. సుప్రీంకోర్టు

ఢిల్లీలో కాలుష్యంపై విచారిస్తు సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. దేశ రాజధానిలో ఇంత కాలుష్యంతో ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో చూడండి అంటూ మండిపడింది. వెంటనే కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇప్పుడు కాలుష్యం తగ్గినా విచారణ ఆపబోమని, దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని తెలిపింది. ఈ విషయంలో తాము ఎన్నికల గురించి ఆలోచించడం లేదని, ప్రతి రాష్ట్రం ఏం చేస్తున్నదా? అని పరిశీలించబోమని వివరించింది.
 

what signals we are sending to world.. Supreme Court on  delhi pollution
Author
New Delhi, First Published Nov 24, 2021, 12:59 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని Delhiలో మూడు వారాలుగా Air Pollution తీవ్ర స్థాయిలో ఉన్నది. ఇప్పటికీ రాజధాని నగరం కాలుష్య మేఘం కిందే ఉన్నది. ఢిల్లీ వాయు కాలుష్యంపై Supreme Court విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, మరోసారి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. తాత్కాలిక చర్యలు ఎంత మాత్రం ఉపయుక్తం కావని, దీర్ఘకాలికంగా శాశ్వత ఉపశమన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పుడు తీసుకునే చర్యలతో కాలుష్య ప్రమాణాలు కొంత తగ్గి పరిస్థితులు మెరుగుపడినా తాము విచారణను ఆపబోమని వెల్లడించింది. ఈ విచారణ కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు, సూచనలు ఇస్తామని తెలిపింది. ‘ఇది దేశ రాజధాని. దేశ రాజధానిలోనే ఇంతటి కాలుష్యంతో ప్రపంచానికి ఏం సంకేతాలు ఇస్తున్నామో చూడండి’ అంటూ ఆగ్రహించింది.

ఎన్నికలు తమ విచారణను ప్రభావితం చేయబోవని పేర్కొంది. పంజాబ్‌లో ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. మరో వైపు పంజాబ్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాల రైతుల ధర్నాకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలు రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు మళ్లీ పంజాబ్‌, హర్యానాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా కఠిన ఆంక్షలు తీసుకోవడంపైనా ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము ఎన్నికలను ఇక్కడ పట్టించుకోవడం లేదని, ప్రతి రాష్ట్రం ఏం చేస్తున్నదీ? అని అడుగుతూ కూర్చోవడం కుదరదని వివరించింది. ‘కాలుష్య పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పారు కదా.. ! మెరుగు పడటానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటో వివరించండి’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Also Read: Delhi Air Pollution: పూర్తి లాక్‌డౌన్‌కు సిద్దం.. సుప్రీం కోర్టుకు తెలిపిన ఢిల్లీ ప్రభుత్వం

ఇప్పుడు సూపర్‌ కంప్యూటర్‌లు అందుబాటులో ఉన్నాయని, కాబట్టి, ఎప్పటికప్పుడు వాతావరణంలోని కాలుష్య ప్రమాణాల లెక్కలను ఆరా తీయాలని, ఆ గణాంకాల ఆధారంగా సమీప భవిష్యత్‌లో కాలుష్యం పెరగకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఢిల్లీలో ఆమోదించ తగిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంతనో ముందు నిర్ధారించాలని పేర్కొంది.

కాగా, తాము కొన్ని వెంటనే తీసుకునే చర్యలను తమకు విన్నవిస్తున్నామని కేంద్ర తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఇవి దీర్ఘకాల ప్రణాళికలు కూడా అని వివరించారు. దశల వారీగా తీసుకునే చర్యలను ఇందులో పొందుపరుస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో కాలుష్యంపై విచారించాలని పిటిషన్ వేసిన పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నియంత్రించాల్సి ఉన్నదని, రైతులకు పరిహారం చెల్లిస్తే వీటిని అరికట్టవచ్చు అని తెలిపారు.

Also Read: అక్కడ పీల్చే గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరం: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

దీనికి సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం స్పందిస్తూ ‘పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ఎంత మొత్తంలో పంట వ్యర్థాలను తొలగించారో అని తెలియజేసే అధ్యయనాలు ఏవైనా ఉన్నాయా? అని అడిగింది. ఇది చాలా పెద్ద సమస్య అయి కూర్చోవచ్చు అని పేర్కొంది. ఈ చర్చలో మనం కొంత కామన్ సెన్స్‌ను కచ్చితంగా కలిగి ఉండాలని చెబుతూ, ఇంత కాలుష్యం పెరుగుతున్నా అక్కడి అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నదని ప్రశ్నించింది. పంట వ్యర్థాలను నియంత్రించడంపై అక్కడి కార్యదర్శులే చర్యలు తీసుకోనివ్వండి అని తెలిపింది. వారి స్వయంగా పంట పొలాలు, వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి ఎందుకు రైతులతో మాట్లాడకూడదు? అంటు అడిగింది. వారే శాస్త్రజ్ఞులతోనూ చర్చలు జరిపి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఎందుకు తీసుకురాకూడదు? అని ప్రశ్నించింది. అనంతరం ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios