సీఎంగా యడ్యూరప్ప: స్పీకర్ రమేష్ కుమార్ ఏం చేస్తారు?
అందరి కళ్లు ప్రస్తుతం కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ పైనే ఉన్నాయి. స్పీకర్ తదుపరి చర్య ఎలా ఉంటుందనే విషయమై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.
బెంగుళూరు: కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ భవితవ్యంపై సర్వత్రా చర్చ సాగుతోంది. శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత యడ్యూరప్ప అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
కుమారస్వామి అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యాడు. విశ్వాస పరీక్ష ముగిసిన రెండు రోజులకు ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ గురువారం రాత్రి అనర్హత వేటు వేశాడు.
ఈ నిర్ణయంతో అసంతృప్త ఎమ్మెల్యేల్లో భయం నెలకొంది. ఇదిలా ఉంటే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.
అయితే అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో స్పీకర్ కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం ఉన్న స్పీకర్ రమేష్ కుమార్ పై కుమారస్వామి విశ్వాస పరీక్ష సమయంలో బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
ఈ విషయమై స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీ వేదికగానే బీజేపీ విమర్శలకు సమాధానం ఇచ్చారు. తాను జేబులోనే రాజీనామా పత్రాన్ని పెట్టుకొని తిరుగుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని కూడ స్పీకర్ సభలో చూపారు.
ఈ నెల 31వ తేదీలోపుగా అసెంబ్లీలో యడ్యూరప్ప బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలంటే కాంగ్రెస్, జేడీ(ఎస్) అసంతృప్త ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపుకు తిప్పుకోవాల్సి ఉంటుంది.
యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే స్పీకర్ తన పదవికి రాజీనామా చేస్తారనే అంటున్నారు. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆయనపై అవిశ్వాసం పెట్టి గద్దెదించాలి. రమేష్ కుమార్ స్థానంలో మరొకరిని స్పీకర్ గా నియమించుకోవాలి.
ప్రస్తుతమున్న స్పీకర్పై యడ్యూరప్పకు విశ్వాసం ఉంటే ఆయనను కొనసాగించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యడ్యూరప్ప అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకొనే వరకు స్పీకర్ గా కొనసాగించే అవకాశం లేకపోలేదంటున్నారు.
సంబంధిత వార్తలు
కర్ణాటకలో మధ్యంతరం తథ్యం: సిద్దరామయ్య
నేడు ఆరు గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం