బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించండి.. సమావేశాలకు దూరంగా ఉండండి : ప్రజలకు ఐఎంఏ సూచన
పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అయితే సరైన జాగ్రత్తలు పాటించాలని ఇండియా మెడికల్ అసోసియేషన్ కోరింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలని, వివాహాలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రజలకు గురువారం పలు సూచనలు జారీ చేసింది. ‘‘ వివిధ దేశాలలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న దృష్ట్యా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తక్షణమే కోవిడ్ తగిన ప్రవర్తనను అనుసరించాలని విజ్ఞప్తి చేస్తోంది’’ అని ఓ ప్రకటనను విడుదల చేసింది.
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. గత 24 గంటల్లో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి ప్రధాన దేశాల నుండి దాదాపు 5.37 లక్షల కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని అందులో పేర్కొంది. గత 24 గంటల్లో భారత్ లో 145 కొత్త కేసులు నమోదయ్యాయని, వీటిలో నాలుగు కొత్త చైనా వేరియంట్ బీఎఫ్ - 7 అని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, అంకితభావంతో కూడిన వైద్య సిబ్బంది, ప్రభుత్వం నుండి మద్దతు, తగినంత మందులు, వ్యాక్సిన్ల లభ్యత కారణంగా భారతదేశం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొగలదు అని ఐఎంఏ నొక్కి చెప్పింది.
తాజ్ మహల్ పర్యాటకులకు కరోనా పరీక్షలు తప్పనిసరి..: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
అత్యవసర మందులు, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచాలని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు అవసరమైన సూచనలు జారీ చేస్తూ 2021లో కనిపించే పరిస్థితికి సంసిద్ధతను పెంచాలని ఐఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ‘‘ప్రస్తుతానికి పరిస్థితి ఆందోళనకరంగా లేదు. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. ’’ అని తెలిపింది. రాబోయే కోవిడ్ వ్యాప్తిని అధిగమించడానికి పలు సూచనలు పాటించాలని కోరింది. అవి ఏంటంటే ?
1. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ లు వాడాలి.
2. సామాజిక దూరం పాటించాలి.
3. సబ్బు, నీరు లేదా శానిటైజర్లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.
4. వివాహాలు, రాజకీయ లేదా సామాజిక సమావేశాలు వంటి బహిరంగ సమావేశాలను నివారించాలి.
5. అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండండి.
6. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
7. వీలైనంత త్వరగా ముందు జాగ్రత్త మోతాదుతో సహా మీ కోవిడ్ వ్యాక్సినేషన్ పొందండి.
8. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసే సలహాలను పాటించండి.
తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన పీయూష్ గోయల్.. బీహార్ ప్రజలను కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
దేశవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా వైద్య అభ్యాసకులతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరోనా మహమ్మారితో పోరాడటానికి సిద్ధంగా ఉందని చెప్పారు. కోవిడ్ నివారణ చర్యల కోసం ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని ఐఎంఏ హామీ ఇచ్చింది.
కాగా.. జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనా, అమెరికా వంటి కొన్ని దేశాలలో కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో, వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. డెవలప్ అవుతున్న వేరియంట్లను ట్రాక్ చేయడానికి కోవిడ్ పాజిటివ్ నమూనాల మొత్తం జన్యుక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను బుధవారం కోరింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిఘాను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించింది.