పాకిస్థాన్ దాడితో సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని పాకిస్థాన్ యుద్ధ విమానాలతో రెచ్చిపోతోంది. జమ్ముతో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా దాడుల చేస్తోంది. దీంతో ఈ రోజు రాత్రి ఏం జ‌ర‌గ‌నుంద‌న్న ఉత్కంఠ అంద‌రిలోనూ నెల‌కొంది.   

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ, జమ్మూ కాశ్మీర్‌లోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి పరిస్థితి తారాస్థాయికి చేరింది. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా జమ్మూ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పేలుడు శ‌బ్ధం వినిపించడంతో హై అలర్ట్ ప్రకటించారు.

స్కూళ్లకు సెలవు:

జమ్మూ, సామ్బా, కథువా, రాజౌరి, పూంఛ్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మే 9న మూసివేయాలని డివిజనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. “ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, జమ్మూ డివిజన్‌లోని పలు జిల్లాల్లోని స్కూళ్లు, కళాశాలలు మే 9న మూసివేయబడతాయి,” అని అధికారులు వెల్లడించారు.

జమ్మూ ఎయిర్‌పోర్ట్ దాడి:

గురువారం రాత్రి జమ్మూ విమానాశ్రయం సమీపంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. వాయుసేన బేస్ దగ్గర RAF సిబ్బంది హై అలర్ట్‌లో ఉన్నారు.

పాక్ F-16ల ధ్వంసం:

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుండగా, భారత సైన్యం పాకిస్తాన్ లోని అనేక విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేపట్టింది. లాహోర్, రహీమ్ యార్ ఖాన్, సియాల్కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ వాయుసేనకు చెందిన కొన్ని F-16 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయ‌ని తెలుస్తోంది.

ఈ రాత్రికి ఏం జరుగనుంది.? 

సరిహద్దుల్లో ఉద్రిక్త‌త‌ పెరుగుతోంది. భారత భద్రతా సంస్థలు పూర్తి అప్రమత్తతతో ఉండగా, రాత్రి సరిహద్దుల్లో మళ్లీ భారీ కాల్పులు జరగవచ్చన్న భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలను ఇంట్లోనే ఉండాలని అధికారులు కోరుతుండటంతో ఆందోళన వాతావరణం మరింత తీవ్రంగా మారింది.