ఢిల్లీ లిక్కర్ స్కాం : విజయ్ నాయర్కు 13 రోజుల రిమాండ్... తీహార్ జైలుకు తరలింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం తన రెండో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ క్రమంలో కీలక నిందితుడు విజయ్ నాయర్కు 13 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని తీహార్ జైలుకు తరలించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు విజయ్ నాయర్ను తీహార్ జైలుకు తరలించారు పోలీసులు. కస్టడీ ముగిశాక అతనిని ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్ట్ విజయ్ నాయర్కు 13 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో శనివారం ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశాలతో విచారణ జరుపుతున్న ఈడీ.. అందులో విజయ్ నాయర్ పాత్ర వుందని కోర్టుకు తెలిపింది.
ఇకపోతే.. ఇదే కేసులో నిన్న కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లతో పాటు పలువురి పేర్లను చార్జీషీట్ లో చేర్చింది సీబీఐ.కుల్ దీప్ సింగ్, నరేంద్రసింగ్ అనే ఇద్దరు ప్రభుత్వ అధికారులతో పాటు ఏడుగురి పేర్లను సీబీఐ ఈ చార్జీషీట్ లో చేర్చింది. సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్,అరుణ్ రామచంద్రన్ పిళ్లైల పేర్లు కూడా సీబీఐ ఆ చార్జీషీట్ లో పొందుపర్చింది. ఈ కేసులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్టుగా సీబీఐ తెలిపింది. అభియోగాలు మోపిన వారిలో మరో ఐదుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రైవేట్ వ్యక్తుల కోసం పాలసీలో మార్పులు చేర్పులు చేసినట్టుగా చార్జీషీట్ లో సీబీఐ తెలిపింది.
ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు లేదు. త్వరలోనే మనీష్ సిసోడియాను మరోసారి సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మనీష్ సిసోడియాను ఏ1 గా చేర్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఆగస్టు మాసంలో విచారించారు.మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంకు ఖాతాలను, ఆయన భార్య ఖాతాలను లాకర్లను కూడ సీబీఐ అధికారులు పరిశీలించారు.
Also REad:ఢిల్లీ లిక్కర్ స్కామ్.. మనీలాండరింగ్ కేసుపై తొలి చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ..
మరోవైపు.. అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అభిషేక్ కస్టడీ ముగియడంతో అధికారులు అతడిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్నందున రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రూ.100 కోట్లు చేతులు మారాయని ఈడీ తెలిపింది. విజయ్ నాయర్ ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని.. లిక్కర్ స్కాంలో ల్యాప్ టాప్ కీలకమని ఈడీ అధికారులు తెలిపారు.
ఇదే కేసులో ఇతర నిందితులైన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు జైలులో ఇంటి నుంచి ఆహారం తెచ్చేందుకు నిరాకరించింది కోర్ట్. ఏదైనా కావాలనుకుంటే జైలు అధికారులకు చెప్పి చేయించుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే కొన్ని పుస్తకాలు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించాలని నిందితులు కోరగా... అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. అన్ని పుస్తకాలు జైలులోనే దొరుకుతాయని పేర్కొన్నారు.