గోవును ఢీకొన్న వందే భారత్ ఎక్స్ప్రెస్.. రెండు రోజుల్లో రెండో ఘటన
వందే భారత్ ఎక్స్ప్రెస్ మరో సారి పశువులను ఢీకొట్టింది. ఈ సారి ఓ గోవును ఢీకొంది. గురువారం నాటి ప్రమాదంలో నాలుగు గేదెలు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. తాజా ఘటనలో గోవు పరిస్థితి గురించి సమాచారం అందలేదు.
అహ్మదాబాద్: వందే భారత్ ఎక్స్ప్రెస్ శుక్రవారం మరో సారి పశువులను ఢీకొంది. ముంబయి సెంట్రల్, గాంధీ నగర్ల మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ శుక్రవారం ఓ గోవును ఢీకొంది. ఆనంద్ స్టేషన్ సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వాట్వా స్టేషన్ సమీపంలో బర్రెల మందను ఈ ఎక్స్ప్రెస్ ఢీకొట్టిన తర్వాతి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిన్నటి ఘటనలో నాలుగు గేదెలు మరణించాయి. తాజాగా, ఈ రోజు కూడా గోవును ఢీకొట్టింది.
తాజా ఘటనలో ఎక్స్ప్రెస్ ముందు భాగంలో చిన్న సొట్ట పడింది. అయితే, పెద్ద డ్యామేజీ ఏమీ కాలేదు.
‘ట్రైన్కు ఏమీ డ్యామేజీ కాలేదు. ట్రైన్ ఫ్రంట్ కోచ్ నోస్ కోన్కు చిన్న డెంట్ పడింది. ట్రైన్ ప్రస్తుతం యథావిధిగా నడుస్తున్నది’ అని ఓ రైల్వే అధికారి వివరించారు. ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత పది నిమిషాల పాటు నిలిచిపోయిందని స్థానికులు చెప్పారు.
ఈ ఘటన పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. పశువు లను ఢీకొట్టే పరిస్థితులు నివారించలేమని తెలిపారు. ఇది దృష్టిలో ఉంచుకునే ట్రైన్ డిజైన్ చేసినట్టు పేర్కొన్నారు.
వాట్వా రైల్వే స్టేషన్ సమీపం లో వందే భారత్ ట్రైన్.. ఢీకొనడంతో నాలుగు గేదెలు మృతి చెందాయి. అయితే, ట్రైన్ ముందు భాగం కొంత ధ్వంసమైంది. కానీ, దాన్ని గంటల వ్యవధి లోనే సరి చేశారు. తాజాగా, ఇదే ఘటనలో మరో వార్త ముందుకు వచ్చింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో మరణించిన గేదెల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇంకా ఆ యజమానిని గుర్తించలేదు.
ముంబయి సెంట్రల్ - గాంధీనగర్ మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రధాని మోడీ ఇటీవలే గుజరాత్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మణినగర్, వాట్వా రైల్వే స్టేషన్ల మధ్య ఉదయం 11.18 గంటల ప్రాంతంలో గేదెలను ఈ ట్రైన్ ఢీకొంది.
వెస్ట్రన్ రైల్వే ప్రతినిధి జితేంద్ర కుమార్ జయంత్ ఈ ఘటన పై మాట్లాడుతూ, ‘వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు అడ్డుగా ట్రాక్ పైకి వచ్చిన గేదెలను ఢీకొంది. ఈ గేదెల యజమానుల పై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసింది. ఆ యజమానులను ఇంకా గుర్తించాల్సి ఉన్నది’ అని వివరించారు.
గురువారం సాయంత్రం ఈ కేసు నమోదు చేసినట్టు వివరించారు. రైల్వే యాక్ట్ 1989 లోని సెక్షన్ 147 కింద ఈ కేసు పెట్టారు.