పాక్కు గూఢచర్యం చేస్తున్న వ్యాపారవేత్త షాజాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.యూట్యూబర్ జ్యోతి మల్హొత్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
పహల్గాం దాడి నేపథ్యంలో దేశం అంతటా ఉగ్రవాద నిర్మూలన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. కేంద్రం దిశానిర్దేశంతో భద్రతా సంస్థలు దేశం లోపలే ఉంటూ విదేశీ శత్రు శక్తులకు సహకరిస్తున్న వారిపై నిఘా ఉంచి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త షాజాద్ను పాక్ గూఢచర్య ఆరోపణలతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.
సమాచార చౌర్యానికి..
షాజాద్ యూపీలోని రాంపుర్కు చెందినవాడు. ఆయన పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తరఫున భారత్-పాక్ సరిహద్దుల్లో అక్రమ రవాణా, సమాచార చౌర్యానికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. ISIతో గత కొంతకాలంగా సంబంధాలు కొనసాగిస్తూ, దేశ భద్రతకు కీలకమైన సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది.
పాకిస్థాన్కు పలు మార్లు..
వాణిజ్య రవాణా ముసుగులో షాజాద్ పాకిస్థాన్కు పలు మార్లు వెళ్లివచ్చినట్టు, అందులో సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వస్తువులను పంపుతూనే గూఢచర్య సమాచారం పంచినట్టు సమాచారం. అంతేకాకుండా, భారత్లో పలు సిమ్కార్డ్లను సేకరించి ISI ఏజెంట్లకు పంపించడమే కాదు, యూపీలోని యువతను ఉగ్రవాదానికి ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేశాడు.
పోలీసుల కస్టడీలో..
ఈ వ్యక్తి సహాయంతో పాకిస్థాన్కి వెళ్లే యువతకు ఉగ్రవాద సంస్థలే వీసాలు ఏర్పాటు చేస్తుండగా, గతంలో ఇదే తరహాలో హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కూడా అరెస్ట్ చేసిన విషయం గుర్తించదగ్గది. ఆమె పాక్ ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన హైకమిషన్ ఉద్యోగి డానిష్తో సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉంది.
జమ్మూకశ్మీర్లో..
ఇక మరోవైపు జమ్మూకశ్మీర్లో సైన్యం, పోలీసుల సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల షోపియాన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ మరియు ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాద సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు పిస్టళ్లు, నాలుగు గ్రనేడ్లు, 43 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో భద్రతను కాపాడేందుకు ఉగ్రవాద కార్యకలాపాలపై సున్నితంగా పర్యవేక్షణ కొనసాగుతున్న ఈ సమయంలో, దేశంలో నుంచే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.