అవమానించిన పార్టీలో ఇంకా ఎందుకు.. ఎన్డీయేలోకి రండి: అమరీందర్కు కేంద్ర మంత్రి ఆహ్వానం
అమరీందర్ సింగ్ ఎన్డీయేలోకి రావాలంటూ కేంద్ర మంత్రి, ఆర్పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలె ఆయనను ఆహ్వానించారు. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందన్నారు. సిద్ధూ విషయంలో అమరీందర్ వైఖరి సరైందేనని అథవాలె ప్రశంసించారు
పంజాబ్ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో తాను విసిగిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైకమాండ్కు తన సమర్థతపై అనుమానం కలగడం తనకు అవమానమేనంటూ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నుంచి అమరీందర్ సింగ్కు ఆహ్వానాలు అందుతున్నాయి.
ఎన్డీయేలోకి రావాలంటూ కేంద్ర మంత్రి, ఆర్పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలె ఆయనను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు.
Also Read:పంజాబ్: రేపు 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చరణ్జిత్ సింగ్
ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ .. సిద్ధూకి అమరీందర్కి మధ్య ఉన్న వివాదాన్ని ప్రస్తాంచారు. సిద్ధూ విషయంలో అమరీందర్ వైఖరి సరైందేనని అథవాలె ప్రశంసించారు. సిద్దూ పాకిస్తాన్ వెళ్లి ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామంగా అభివర్ణించారు. అమరీందర్ చెప్పింది కరెక్టేనని... సిద్ధూ మోసగాడు అని అథవాలె వ్యాఖ్యానించారు. అయితే రాజీనామా చేసిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్లోనే వుంటానని చెప్పారు. ఇదే సమయంలో అనుచరులు, మద్ధతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అథవాలే ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.