పంట కొనుగోళ్లలో రైతులకు ఊరట.. మధ్యవర్తులకు, ట్రేడర్లకు చెక్.. కేంద్రం నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం రైతులకు లబ్ది చేకూర్చే కీలక నిర్ణయం తీసుకుంది. పంట విక్రయాల్లో రైతులు నష్టపోకుండా రాష్ట్రాల ప్రొక్యూర్మెంట్ పోర్టల్స్ను ఏకీకృతం చేయనుంది. కనిష్ట సూచికలనూ అందులో చేర్చడం ద్వారా వ్యాపారులు, మధ్యవర్తుల మోసాలను అరికట్టనుంది.
న్యూఢిల్లీ: రైతులకు లబ్ది చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల పంట కొనుగోళ్ల పోర్టల్లను ఏకీకృతం చేయడానికి నిర్ణయించింది. అందులో కనిష్ట ధరనూ నిర్ణయం చేయనుంది. తద్వార రైతుల నష్టాలకే తమ పంటను విక్రయించాల్సిన గత్యంతరాన్ని తొలగించనుంది. రైతులు మోసపోకుండా మధ్యవర్తులకు, ట్రేడర్లకు ఈ నిర్ణయం ద్వారా చెక్ పెట్టనుంది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మధ్యవర్తులను, వ్యాపారుల దౌర్జన్యాలను కట్టడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం సరికొత్త అప్లికేషన్లను తయారు చేసింది. అన్ని రాష్ట్రాల కొనుగోళ్లు పోర్టల్లను ఈ నిర్ణయంతో ఏకీకృతం చేయనుంది. అందులో కనిష్ట ధరలను నిర్ణయించనుంది. తద్వారా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ విధానాన్ని ఈ నెలలోనే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో అమలు చేయాలని సంకల్పించినట్టు కేంద్రం వెల్లడించింది.
ఈ నిర్ణయంతో రైతులు తమ పంటను నష్టాలకు అమ్ముకోవాల్సిన అగత్యం తప్పించనుంది. కొనుగోలు ఏజెన్సీలు సులువుగా పంటను సేకరించవచ్చు. ఫలప్రదంగా వ్యవహారాలు నిర్వర్తించవచ్చు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వమూ రాష్ట్రాలకు నిధులను విడుదల చేయడం సులభతరం కానున్నట్టు వివరించింది.
కేంద్రం తెచ్చిన మూడు మూడు సాగు చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పలు సాగు సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నది. అదీగాక, ప్రస్తుతం లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. కేంద్ర ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.