కాంగ్రెస్తో కటీఫ్! సావర్కర్పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఉద్ధవ్ టీమ్ అప్సెట్
వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన తీవ్ర విమర్శలు ఎంవీఏ కూటమికి ఎసరుతెచ్చేలా ఉన్నాయి. రాహుల్ విమర్శలతో ఉద్ధవ్ ఠాక్రే శివసేన టీమ్ అప్సెట్ అయింది. దీంతో కూటమి నుంచి వైదొలిగే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.
ముంబయి: మహారాష్ట్రలో వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంవీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్తో ఉద్ధవ్ ఠాక్రే టీమ్ అప్సెట్ అయింది. దీంతో ఎంవీఏ కూటమి కంచికి చేరనుందే వాదనలు వస్తున్నాయి. ఇప్పటికే ఉద్ధట్ ఠాక్రే టీమ్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది.
ఇదే విషయాన్ని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ను ఎన్డీటీవీ అడిగింది. రాహుల్ గాంధీ.. వీడీ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నుంచి పొత్తును ఉద్ధవ్ ఠాక్రే టీమ్ రద్దు చేసుకుంటుందా? అని అడగ్గా.. త్వరలోనే దీనిపై ఉద్ధవ్ ఠాక్రే పై ప్రకటన చేయవచ్చు అని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు. ఈ రోజు ఉదయమే సంజయ్ రౌత్ ఇందుకు సంబంధించి ఓ స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఎంవీఏ కూటమిలో శివసేన ఇక పై కొనసాగకపోవచ్చని సంజయ్ రౌత్ పేర్కొన్నారని వివరించారు. పార్టీ నుంచి వచ్చిన సీరియస్ రియాక్షన్ ఇది అని తెలిపారు. ఇంతకు మించి ఇంకేం కావాలి అని అన్నారు.
Also Read: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో మహాత్మాగాందీ మునిమనవడు తుషార్ గాంధీ.. చరిత్రాత్మకం: కాంగ్రెస్
వీడీ సావర్కర్ పై కామెంట్లు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్తో పొత్తు కొనసాగిస్తారా? అని అడగ్గా.. జమ్ము కశ్మీర్లో పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వారిని అడగలేదని నిలదీశారు. ఈ రెండు పార్టీల భావజాలాలూ భిన్నమైనవే అని, ఇప్పుడు తమను ప్రశ్నిస్తున్నవారినే ఆ కూటమి గురించి ఆరా తీయాలని సూచనలు చేశారు.
సావర్కర్ భావజాలం తమకు ప్రధానమైనదని, తాము ఆయన భావజాలాన్ని విశ్వసిస్తామని తెలిపారు. ఇలాంటి విషయాలను కాంగ్రెస్ బయటకు తీసుకువచ్చి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. సమిష్టిగా ఉండాలని, విభజనను ప్రోత్సహించరాదని అన్నారు. అదీ ముఖ్యంగా భారత్ జోడో నినాదాన్ని హైలైట్ చేస్తున్నవారు ఇలా చేయడం సరికాదని వివరించారు. అంటే.. కాంగ్రెస్కు సూచనలు చేస్తున్నారా? అని అడగ్గా.. తాను కాంగ్రెస్కు సూచన చేసేంత పెద్దవాడిని కాదని అరవింద్ సావంత్ అన్నారు.