టర్కీ భూకంపం: ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లను పంపనున్న భారత్.. 600 మందికి పైగా మృతి
Turkey-syria earthquake: భూకంపం కారణంగా టర్కీలో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయనీ, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జీఎఫ్ జెడ్ నివేదించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. టర్కీకి సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
India to send aid to earthquake-hit Turkey: టర్కీలో భూకంప బాధిత ప్రజలకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమంలో ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే "టర్కీని తాకిన విధ్వంసక భూకంపాన్ని మనమందరం చూస్తున్నాము. అనేక మంది మరణించడంతో పాటు భారీ నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. టర్కీకి సమీపంలోని దేశాలలో కూడా నష్టం సంభవించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భారత ప్రజలందరూ వారి సంక్షేమం కోసం.. భాదిత కుటుంబాలతో మన ఆలోచనలు ఉన్నాయి.." అని అన్నారు. అలాగే, భూకంప బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
భూకంపం కారణంగా టర్కీలో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయనీ, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జీఎఫ్ జెడ్ నివేదించింది. టర్కీలోని దాదాపు పది ప్రావిన్సులలో భారీ నష్టం సంభవించింది. ఇటు సిరియాలోనూ మరణాలు 50కి పైగా సంభవించాయని సమాచారం. భూకంపం సంభవించిన ప్రాంతాలకు తక్షణమే సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపించామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ట్విట్టర్లో తెలిపారు. అలాగే, ప్రపంచ దేశాలు సాయం చేయాలని కోరారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లను పంపనున్న భారత్..
భూకంపం ధాటికి 600 మందికి పైగా మృతి చెందిన టర్కీకి సహాయక సామగ్రితో పాటు జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్డీఆర్ఎఫ్), వైద్య బృందాలను భారత్ పంపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, అవసరమైన పరికరాలతో 100 మంది సిబ్బందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించి గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
శిక్షణ పొందిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో అవసరమైన మందులతో వైద్య బృందాలను సిద్ధం చేస్తున్నారు. టర్కీ ప్రభుత్వం, అంకారాలోని భారత రాయబార కార్యాలయం, ఇస్తాంబుల్ లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం సమన్వయంతో సహాయక సామగ్రిని పంపుతామని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.