ట్రంప్కేమో సీ ఫుడ్ అంటే ప్రాణం, మెలానియాకు నట్స్ దిగవు: మరి ఇండియాలో ఎలా
ట్రంప్ దంపతుల ఆహారపు అలవాట్లను చూస్తే... యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ గింజలను తినరు, అలాగే ట్రంప్ సీ ఫుడ్ను అమితంగా ఇష్టపడతారు. ఇక ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్... జారెడ్ కుష్నర్తో వివాహం తర్వాత జుడాయిజాన్ని అనుసరిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్తో కలిసి తొలిసారి భారతదేశానికి వస్తున్నారు. దీంతో ఇండియన్ మీడియా వారి పర్యటనకు భారీ కవరేజ్ ఇస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేత, కనుసైగతో శాసించగల అగ్రరాజ్యాధినేత రావడంతో ప్రతిరోజూ ఆయన గురించి పతాక శీర్షికల్లో వార్తలు వస్తున్నాయి. వారి రోజువారీ జీవనం, విలాసాలు, అధికారాల గురించి విశ్లేషణలు వస్తున్నాయి.
Also Read:ఇండో- అమెరికా మధ్య ట్రేడ్ డీల్: ఇవీ గందరగోళానికి కారణాలు..
తాజాగా ట్రంప్ దంపతుల ఆహారపు అలవాట్లను చూస్తే... యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ గింజలను తినరు, అలాగే ట్రంప్ సీ ఫుడ్ను అమితంగా ఇష్టపడతారు. ఇక ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్... జారెడ్ కుష్నర్తో వివాహం తర్వాత జుడాయిజాన్ని అనుసరిస్తున్నారు. దీంతో ఆమె కోషర్ డైట్ను ఫాలో అవుతున్నారు.
ట్రంప్ కుటుంబసభ్యులు భారత పర్యటన నేపథ్యంలో వారు బస చేసే ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్ సిబ్బందికి వైట్ హౌస్ అధికారులు మెనూను అందించారు. మొత్తం హోటల్ను ట్రంప్ అతని పరివారం కోసమే బుక్ చేశారు. రాబోయే మూడు రోజుల్లో బయటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఐటీసీ మౌర్యా తెలిపింది.
హోటల్లోని 446 చ.మీ వైశాల్యంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ చాణక్యలో ట్రంప్ ఉంటారు. గతంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్క్లింటన్, బరాక్ ఒబామాలు కూడా ఇందులోనే బస చేశారు.
ఇందులో పీకాక్ థీమ్తో 12 సీట్లతో ఉన్న డైనింగ్ టేబుల్, ముత్యాలు పొదిగిన మినీ స్పా, జిమ్ ఉన్నాయి. ఇప్పటికే భారతీయ కళాకారులతో డిజైన్ చేయించిన కళాఖండాలను హోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
అలాగే ట్రంప్ బస చేసే సూట్ రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, ప్రెసిడెన్షియల్ పార్కింగ్ బౌలేవార్డ్, ప్రత్యేక ప్రవేశ ద్వారం, ప్రైవేట్ హై స్పీడ్ ఎలివేటర్ను అమర్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా మెరుగ్గా గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా ఏర్పాటు చేశారు.
Also Read:ప్రభాస్ లాగా మారిపోయిన డోనాల్డ్ ట్రంప్.. బాహుబలి టీం రెస్పాన్స్!
అమెరికా అధ్యక్షుడు తన సుడిగాలి పర్యటనలో భాగంగా ఎక్కువ సమయం హోటల్లో గడపటానికి అవకాశం లేదు. ప్రసిద్ధ బుఖారా రెస్టారెంట్లో ఆయన భోజనం చేస్తారు. అయితే ట్రంప్ తన సొంత చెఫ్ బృందాన్ని వెంట తెచ్చుకున్నారు.
పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఎన్ఎస్జీ, ఎస్పీజీ దళాలు మౌర్యాను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఆ చుట్టుపక్కల రెండు మూడు రోజుల పాటు హోటల్స్ మూతపడ్డాయి. భద్రతా కారణాల రీత్యా దగ్గరలోని తాజ్ ప్యాలెస్ హోటల్లోని కొన్ని గదుల బుకింగ్స్ను బ్లాక్ చేశారు. దీంతో సెంట్రల్ ఢిల్లీలోని లగ్జరీ హోటల్స్లో బుకింగ్స్ భారీగా పెరిగాయి.